Breaking News

దేశంలో పెద్ద ఎత్తున సామూహిక వ్యాప్తి దశలోకి కరోనా.. నిపుణులు వెల్లడి


దేశంలో సామూహిక వ్యాప్తి దశలోకి ప్రవేశించలేదని ప్రభుత్వం చెబుతోంది.. కానీ, నిపుణులు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ ఇప్పటికే పెద్ద ఎత్తున సామూహిక వ్యాప్తి దశలోకి చేరిందని అంటువ్యాధి నిపుణుల సంఘాలు, ప్రజారోగ్య నిపుణులు, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ నిపుణులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలుచేసిన సమయంలో వైరస్ అదుపులోనే ఉందని, సడలింపుల తర్వాత తీవ్రత ఎక్కువయ్యినట్టు అర్ధమవుతోందని పేర్కొన్నారు. వ్యాధి సంక్రమణ గురించి సరైన అంచనా వేయగలిగే అంటువ్యాధుల నిపుణులను కేంద్ర ప్రభుత్వం సంప్రదించినట్లయితే, అది మంచి సేవలు అందించేదని అభిప్రాయపడ్డారు. తక్కువ శిక్షణ, అంతంమాత్రంగా నైపుణ్యం కలిగి అందుబాటులో ఉన్న పరిమిత సమాచారం ఆధారంగా ప్రభుత్వానికి కొందరు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది అని వ్యాఖ్యానించారు. ఎపిడిమియాలజీ, ప్రజారోగ్యం, ఔషధ రంగాలు, సామాజిక, సాంకేతిక నిపుణులకు బదులు విధాన నిర్ణేతలైన సాధారణ పరిపాలనా బ్యూరోక్రాట్లపై ఎక్కువగా ఆధారపడటం వల్ల మానవ సంక్షోభం, వ్యాధి వ్యాప్తి పరంగా భారత్ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఘాటుగానే పేర్కొన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడిమియాలజిస్ట్స్ సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేశాయి. ఈ రోజు వరకూ శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు, ప్రజలతో సమాచారం విషయంలో పారదర్శకంగా లేనట్టు స్పష్టంగా కనబడుతోందని ఎత్తిచూపిన నిపుణులు.. ఇది త్వరగా నిర్ధారించబడాలని సూచించారు. లక్షణాలు లేని కేసులు, స్వల్పంగా ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చకుండా ఇంట్లో ఉంచి చికిత్స చేయవచ్చని సిఫార్సు చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పుడు ప్రారంభంలోనే వలస కూలీలను వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించినట్లయితే, ప్రస్తుత పరిస్థితి తలెత్తికాదని వారు పేర్కొన్నారు. సాపేక్షంగా బలహీనమైన ప్రజారోగ్య వ్యవస్థలు, క్లినికల్ కేర్ సౌకర్యాలు లేని జిల్లాల్లోని గ్రామీణ, చిన్న పట్టణాలకు వలస కార్మికులు తిరిగి వస్తున్నారని సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. లాక్‌డౌన్‌తో ప్రధానంగా సాధారణ ఆరోగ్య సేవలను మూసివేయడం, జనాభాలో మొత్తం సగం మంది జీవనోపాధికి అంతరాయం కలిగించడం నిరవధికంగా అమలు చేయడం సరైంది కాదని సంఘాలు తెలిపాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగం సమన్వయంతో కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని నియంత్రించాలని సిఫారసు చేశారు, అదే సమయంలో పేదలు, అట్టడుగున ఉన్నవారి జీవనోపాధికి సరైన చర్యలు చేపట్టాలని సూచించారు.


By June 01, 2020 at 10:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/community-transmission-of-coronavirus-certainly-on-in-country-say-experts/articleshow/76129324.cms

No comments