Breaking News

విజయవాడలో యువకుడిని కిడ్నాప్ .. అరగంటలో కిడ్నాపర్లు అరెస్ట్


విజయవాడలో మరోసారి నేరాల సంఖ్య పెరిగిపోతుంది. రెండు రోజుల క్రితం కొందరు వ్యక్తులు కత్తులతో రోడ్లపై హల్ చల్ చేస్తే.. తాజాగా రెచ్చిపోయిన రౌడీషీటర్లు ఓ యువకుడ్ని కిడ్నాప్ చేశారు. అంతేకాదు తల్లిదండ్రులకు ఫోన్ చేసి నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ కూడా చేశారు. లేదంటే యువకుడ్ని చంపి కృష్ణానదిలో పడేస్తామని బెదిరించారు. విజయవాడ సమీపంలోని నిడమానూరుకు చెందిన రత్నశేఖర్‌ అనే యువకుడిని శనివారం రాత్రి విజయవాడ కృష్ణలంక వద్ద కిడ్నాప్‌ చేశారు. యువకుడ్ని తీసుకెళ్లి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రాతూరు కరకట్ట మార్గంలోని ఓ నివాసగృహంలో నిర్బంధించారు. అనంతరం కిడ్నాప్ చేసిన యువకుడు రత్నశేఖర్‌ తండ్రి వెంకట్రావుకు ఫోన్‌ చేశారు కిడ్నాపర్లు. మీ కుమారుడిని కిడ్నాప్‌ చేశామని వదిలేయాలంటే రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగినంత సొమ్ము ఇవ్వకుంటే కొడుకును చంపి కృష్ణానదిలో పారేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ అంకమరావు తమ సిబ్బందితో వెంటనే రంగంలోకి దిగారు. వెంకట్రావు ద్వారా కిడ్నాపర్లకు ఫోన్‌ చేయించి నగదుతో ఎక్కడికి రావాలని అడిగారు. వారు నాలుగైదు ప్రాంతాలను సూచిస్తూ బాధితులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. అప్పటికే పోలీసులు నిందితుల సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా వారి ఉన్న ఆచూకీని ట్రేస్ గుర్తించారు. నగదుతో ప్రాతూరు కరకట్ట మార్గంలోని ఓ నివాసగృహం వద్దకు రావాల్సిందిగా కిడ్నాపర్లు సూచించారు. ఆ మేరకు పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని కిడ్నాపర్ల అదుపులో ఉన్న రత్నశేఖర్‌ను కాపాడారు. దీనిలో తాడేపల్లికి చెందిన రౌడీషీటర్లు శివకుమార్‌, సాయిరామ్‌, రాంబాబుతోపాటు సతీష్‌, ఓమహిళ పాల్గొన్నట్లు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే ఈ కిడ్నాప్ కేసును కేవలం అరగంటలోనే చేధించారు పోలీసులు.


By June 01, 2020 at 09:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rowdy-sheeter-kidnap-young-man-in-vijayawada/articleshow/76128953.cms

No comments