Breaking News

కాసేపట్లోనే ముహుర్తం... పెళ్లి పీటలపైనే వధువు మృతి


కాసేపట్లో పెళ్లి. బంధువులంతా పెళ్లి వేడుక వద్దకు చేరుకున్నారు. వరుడు వధువు కుటుంబసభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా మారారు. ఓ వైపు పెళ్లికి వచ్చిన వారి కోసం విందు భోజనాలు కూడా సిద్ధమైపోయాయి. వరుడు వధువుల్ని తీసుకొచ్చి కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పెళ్లి పీటలపై ఇద్దర్నీ కూర్చో బెట్టారు. కాసేపటికే వధువు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. కాళ్ల పారాణి ఇంకా ఆరక ముందే పెళ్లి కుతూరు మృత్యు ఒడిలోకి చేరింది. యూపీలోని కనౌజ్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంట తడి పెట్టించింది. థాథియా పోలీస్‌ సర్కిల్‌లోని భగత్‌పూర్వ గ్రామంలో వధువు ఇంట్లో శుక్రవారం రాత్రి పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడు సంజయ్‌.. తన కుటుంబ సమేతంగా వధువు వనిత ఇంటికి చేరుకున్నాడు. కాగా, పెళ్లితంతు జరుగుతుండగా.. వనిత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించారు. కొవిడ్‌ పరీక్షలు చేయాలని అందులో నెగెటివ్‌గా వస్తేనే జాయిన్‌ చేసుకుంటామని డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు కాన్పూర్‌కు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు 112 ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వనిత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. కాసేపట్లో పెళ్లి చేసుకొని కోటి ఆశలతో కొత్త జీవితంలోకి వెళ్లాల్సిన తమ బిడ్డ పెళ్లి వస్త్రాల్లోనే చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. ఈ దుర్ఘటనను చూసిన స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు.


By June 29, 2020 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bride-dies-in-midst-of-wedding-rituals-in-uttar-pradesh/articleshow/76682116.cms

No comments