Breaking News

కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం


జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, అనంత్‌నాగ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. సోమవారం తెల్లవారుజామున కుల్చోహర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలిపారు. కుల్చోహర్ వద్ద ఉగ్రవాదులున్నట్టు నిఘా వర్గాల సమాచారంతో సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. ముష్కరులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మూడో రోజుల కిందట త్రాల్ సెక్టార్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసందే. చెవా ఉల్లార్ గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కాగా, జూన్ నెలలోనే 50 మందికిపైగా ఉగ్రవాదులు వివిధ ఎన్‌కౌంటర్‌లలో హతమయ్యారు. అవంతిపొర పాంపొర్ వద్ద ముగ్గురు, షోపియాన్ జిల్లాలోని మునాంద్‌లోనూ మరో ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం జూన్మ 19న మట్టుబెట్టింది. దీంతో 24 గంటల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులను సైన్యం కాల్చిచంపినట్టయ్యింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సైన్యం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.


By June 29, 2020 at 09:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-terrorists-killed-in-jammu-and-kashmirs-anantnag-encounter/articleshow/76682213.cms

No comments