Breaking News

నేడు తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’.. ముంబయికు పొంచి ఉన్న మరో ముప్పు


తూర్పు మధ్య అరేబియా స‌ముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయం తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉదయం తుఫాను, రాత్రికి తీవ్ర తుఫానుగా మారుతుందని హెచ్చరించింది. ఈ తుఫానుకు ‘నిసర్గ’ అని నామకరణం చేశారు. తీవ్ర తుఫాన్‌గా మారి రూపాంతరం చెంది మహారాష్ట్ర, గుజరాత్ వద్ద రేపు రాత్రి తీరాన్ని తాకనుందని వెల్లడించింది. ప్రస్తుతం తుఫాను గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఇది గోవాలోని పనాజీకి నైరుతిగా 300 కిలోమీటర్లు, మహారాష్ట్రలోని ముంబయికి దక్షిణ-నైరుతిగా 550 కిలోమీటర్లు, గుజరాత్‌లోని సూరత్‌కు నైరుతిగా 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు పేర్కొంది. తూర్పు మధ్యన ఆగ్నేయ అరేబియా మీదుగా ప్రయాణించి, తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా సాగి, ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరం మధ్య హరిహరేశ్వర్ మధ్య వద్ద జూన్ 3 సాయంత్రం లేదా రాత్రి వేళ డామన్‌కు సమీపంలో తీరం దాటుతుందని తెలిపింది. తుఫాను ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి ఉదయం నుంచి గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో, సాయంత్రం తీవ్ర తుఫానుగా మారిన తర్వాత గంటకు 95 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ తుఫాన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను కారణంగా నేటి నుంచి లక్షద్వీప్, కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్రలకు రెడ్ అలెర్ట్ జారీచేసింది. దక్షిణ కొంకణ్, గోవా తీరాల్లో, మధ్య మహారాష్ట్రలో జూన్ 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర కొంకణ్, ఉత్తర మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో జూన్ 3,4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. కరోనాతో అతలాకుతలమవుతోన్న ముంబయి మహానగరానికి తుఫాను రూపంలో మరో ముప్పు పొంచి ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు దూసుకురావడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే సూచించారు. గుజరాత్ దక్షిణ భాగం, డామన్, డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 4 వరకు మత్స్యకారులెవరూ అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.


By June 02, 2020 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cyclone-nisarga-alert-for-north-maharashtra-south-gujarat-coasts-yellow-message/articleshow/76147210.cms

No comments