మధ్యప్రదేశ్ గవర్నర్కు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

మధ్యప్రదేశ్ గవర్నర్ అనారోగ్యంతో శనివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. పది రోజుల కిందట తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు వెళ్లిన లాల్జీ టాండన్.. శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను లక్నోలోని మేదాంత హాస్పిటల్కు కుటుంబసభ్యులు తరలించారు. గవర్నర్ లాల్జీ టాండన్ మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్, జర్వంతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలోనే చికిత్స కొనసాగుతోందని అన్నారు. కోవిడ్-19 పరీక్షను కూడా చేశామని, ఫలితాల్లో నెగెటివ్ వచ్చిందని పేర్కొన్నారు. వీటితోపాటు మరికొన్ని వ్యాధి నిర్దారణ పరీక్షలు కూడా నిర్వహించామని, రిపోర్టులు రావాల్సి ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మిగతా రిపోర్టులు వచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలేదని నిర్ధారణ అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని వెద్యులు తెలియజేశారు. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న గవర్నర్ జూన్ 19న మధ్యప్రదేశ్కు రావాల్సి ఉంది. గవర్నర్ లాల్జీ టాండన్ అస్వస్థతకు గురయినట్టు తెలియడంతో ముఖ్యమంత్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘గవర్నర్ లాల్జీ టాండన్ అనారోగ్యానికి గురయిన విషయం తెలిసింది.. త్వరగా ఆయన కోలుకోవాలని, ప్రజా సేవ కోసం మాకు మార్గనిర్దేశం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’అంటూ ట్వీట్ చేశారు. ఇక, 2009 సార్వత్రిక ఎన్నికల్లో లక్నో నుంచి లోక్సభకు ఎన్నికయిన లాల్జీ టాండన్.. ఆ తర్వాత 2018లో బీహార్ గవర్నర్గా నియమితులయ్యారు. బీహార్ గవర్నర్గా జులై 2019 వరకు కొనసాగిన ఆయనను.. తర్వాత మధ్యప్రదేశ్ గవర్నర్గా నియమించారు.
By June 14, 2020 at 10:33AM
No comments