Breaking News

సరిహద్దుల్లో మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఓ జవాన్ వీరమరణం


సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. సోమవారం తెల్లవారుజామున పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ అమరుడయ్యాడు. దీంతో ఈ నెలలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య నాలుగుకు చేరింది. కృష్ణఘాటీ, నౌషేరా సెక్టార్‌లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడటంతో భద్రత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. నౌషేరా సెక్టార్‌లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ అమరుడయినట్టు ఆర్మీ వెల్లడించింది. పాక్ సైన్యం కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాన్.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. తెల్లవారుజామున ఇరు సైన్యాల మధ్య దాదాపు మూడు గంటల పాటు కాల్పులు కొనసాగాయి. అనంతరం పాక్ బలగాలు తోక ముడిచాయి. పూంఛ్ జిల్లాలో జూన్ 13న శనివారం అర్దరాత్రి తర్వాత పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలోనూ దాయాది విచక్షణరహితంగా కాల్పులకు తెగబడింది. పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో పౌరులు, సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యాలు గుళ్లవర్షం కురిపిస్తున్నారు. అటు, ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని రామ్‌పూర్ సెక్టార్‌‌లోనూ పాక్ దురాగతానికి ఒడిగట్టింది. జూన్ 14 ఆదివారం ఉదయం రామ్‌పూర్ సెక్టార్‌లో మోర్టార్ షెల్స్‌, ఇతర ఆయుధాలతో పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరపగా.. దీనికి భారత్ ధీటుగా బదులిచ్చింది.


By June 22, 2020 at 11:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/one-indian-army-jawan-has-lost-his-life-in-the-ceasefire-violation-by-pakistan-army/articleshow/76504433.cms

No comments