Breaking News

ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన కరోనా కేసులు.. 5 లక్షల మంది బలి


ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. చైనాలో తొలిసారి మొదలైన వైరస్ అన్ని ఖండాలకు విస్తరించింది. చైనా నుంచి తొలుత ఐరోపాకు చేరిన మహమ్మారి ఆ తర్వాత అమెరికాకు పాకింది. ఐరోపాలోని ఇటలీ, యూకే, స్పెయిన్ తదితర దేశాలను కరోనా వైరస్ వణికించింది. ఇటలీలోని వయోవృద్ధుల్లో దాదాపు 75 శాతం మందిని మహమ్మారి తుడిచిపెట్టేసింది. అగ్రరాజ్యాలుగా చెలామణి అవుతున్న దేశాలూ ఈ వైరస్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, అమెరికాను ఇంకా మహమ్మారి వదిలి పెట్టలేదు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వీరిలో ఐదు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 55 లక్షల మంది ఇప్పటి వరకూ కోలుకున్నారు. ఇంకా, 41 లక్షల మందిలో వైరస్ లక్షణాలు ఉండగా.. వీరిలో 57,748 మంది పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 26 లక్షలకు చేరువగా ఉంది. వీరిలో 128,152 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కరోనా వైరస్ కేసులు, మరణాలు చోటుచేసుకున్నాయి. అమెరికా తర్వాత బ్రెజిల్‌లో వైరస్ ఉద్ధృతంగా ఉంది. 13లక్షల మందికిపైగా వైరస్ బారినపడగా.. 57వేల మంది చనిపోయారు. రష్యాలోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య 627,646కి చేరాయి. మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదయిన దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 20వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 5.29 లక్షలకు చేరాయి. అమెరికాలో సగటున రోజుకు 40 వేల మందికి వ్యాధి సోకుతుండగా, భారత్ సహా బ్రెజిల్, రష్యా, మెక్సికో, ఇరాన్, బంగ్లాదేశ్, చిలీ, పెరూ, పాకిస్థాన్ తదితర దేశాల్లో వైరస్ ప్రమాదకరంగా ఉంది. వైరస్ నుంచి దాదాపు బయటపడిందని భావించిన చైనాలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన వారం రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 1.80 లక్షలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. జూన్ 20న 1.57 లక్షలు, 21న 1.30 లక్షలు, 22న 1.39 లక్షలు, 23న 1.64 లక్షలు, 24న 1.73 లక్షలు, 25న 1.87 లక్షలు, 25న 1.94 లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాల్లో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో బ్రెజిల్ లో 57 వేలు, యూకే 43 వేలు, ఇటలీలో 34 వేలు, ఫ్రాన్స్ 29వేలు, స్పెయిన్ 28 వేలు, భారత్ 16వేలు, ఇరాన్ 10వేలు, జర్మనీ 9 వేలకి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.


By June 28, 2020 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/globally-more-than-one-crore-people-are-infected-and-5-lakhs-have-died-due-to-coronavirus/articleshow/76669350.cms

No comments