Breaking News

ఎమర్జెన్సీ: ఇందిర ఏకపక్ష నిర్ణయం.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజుకు నేటితో 45 ఏళ్లు


1975 జూన్ 25న నాటి ప్రధాని ఏకపక్షంగా వ్యవహరించి దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ 21 నెలల పాటు అప్రకటిత నియంతృత్వం రాజ్యమేలి, 1977 మార్చి ఎన్నికలలో ఇందిర ఘోర పరాజయంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. అందుకే జూన్ 25ను భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. దీని కంటే ముందు దేశంలో రెండు సార్లు అత్యవసర పరిస్థితి విధించారు. తొలిసారి 1962లో చైనాతో యుద్ధం, 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలోనూ అత్యవరసర పరిస్థితి ప్రకటించారు. అంతర్గత అలజడి పేరుతో ఎమర్జెన్సీ విధించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదస్పదమైన నిర్ణయాల్లో ఈ అత్యవసర పరిస్థితి ఒకటి. ఇందిర సిఫార్సుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 (1)లోని అంతర్గత అత్యవసర పరిస్థితి నిబంధన వినియోగించుకుని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. అత్యయిక స్థితి విధించిన వెంటనే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం, ఎన్నికల వాయిదా, ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడం, పత్రికలపై నియంత్రించడం లాంటి చర్యలను చేపట్టారు. ఇది 1977 మార్చి 21 వరకు 21 నెలలపాటు కొనసాగింది. ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ ఎన్నికలను నిలిపివేసి, పౌరహక్కులు అడ్డుకునే అధికారాన్ని అత్యవసర పరిస్థితి ప్రధాన మంత్రికి అందించింది. అంతకు ముందు 1971 సాధారణ ఎన్నికల్లో గరబీ హఠావో నినాదంతో 352 పార్లమెంటు స్థానాలను ఇందిర సారథ్యంలోని పార్టీ గెలుపొందింది. మరోవైపు రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. తిరుగులేని మెజార్టీతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు సైతం వివిధ రాష్ట్రాల్లో బలపడటం... రాజకీయంగా, ఆర్థికంగా అవి స్వతంత్రంగా వ్యవహరించడంతో ఇందిరా గాంధీని కలవరపెట్టాయి. అలాగే మౌలికాంశాలైన ప్రాథమిక హక్కులు లాంటివి ప్రభావితం చేస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించకూడదని ప్రఖ్యాత గోలక్ నాథ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ తీర్పును రద్దుచేస్తూ ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలాంటి రాజ్యాంగ సవరణలు కూడా చేయొచ్చని నిరూపించింది. దీంతో న్యాయవ్యవస్థను ప్రభుత్వ నియంత్రించినట్టయ్యింది. ఇందిరా గాంధీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 1973-75 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయ ఆందోళనలు చెలరేగాయి. వీటన్నింటిలోనూ డిసెంబరు 1973 నుంచి మార్చి 1974 వరకూ గుజరాత్‌లో సాగిన నవ నిర్మాణ్ ఉద్యమం చెప్పుకోదగ్గది. ఇది ఎంతలా అంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమం చినికి చినికి గాలివానగా మారి ప్రభుత్వాన్ని రద్దుచేసేదాకా సాగింది. తత్ఫలింగా ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఇదే సమయంలో మరింత శక్తిని ఎన్నికైన పరిపాలకుని చేతిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలనే మేలు అంటూ కొంత మంది కాంగ్రెస్ నేతలు సూచించారు. ఇదే సమయంలో బిహార్‌లో కూడా అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమం తీవ్రమైంది. అధిక ధరలు, అవినీతికి వ్యతిరేకంగా లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి పిలుపునకు స్పందిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు శాంతియుత నిరసనలు కొనసాగించారు. ఎమర్జెన్సీకి ముందు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి రాయ్‌బరేలీ స్థానం ఇందిర గెలిచారని, ఆ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె ప్రధాన ప్రత్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందిర ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్‌ 12న అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఆమె రాజీనామా చేయకుండా హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జూన్‌ 25న జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ ఇందిర ప్రధాని పదవిలో ఉండొచ్చని, కాకపోతే తుది తీర్పు వెలువడే వరకు ఎంపీగా కొనసాగకూడదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో మాట్లాడవచ్చు కానీ ఓటు వేసే అధికారం ఆమెకు ఉండదని పేర్కొన్నారు.


By June 25, 2020 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/why-former-pm-indira-gandhi-declared-emergency-in-india-45-years-ago/articleshow/76618349.cms

No comments