Breaking News

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 2.10 లక్షలకు చేరువలో..


దేశంలో గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 8909 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 2,07,615కు చేరింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 217 మంది చనిపోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5815కు చేరింది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం 48.31 శాతం మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అంటే లక్ష మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి టెస్టుల సంఖ్య పెరగడం కూడా ఓ కారణమే. రోజుకు సగటున 1,20,000 టెస్టులు చేస్తున్నారు. భారత్‌లో కరోనా పీక్ స్టేజ్‌కు చేరుకోదని.. దీనికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని ఐసీఎంఆర్ తెలిపింది. మిగతా దేశాలతో పోలిస్తే కరోనా విషయంలో మెరుగైన స్థితిలో ఉందని ఐసీఎంఆర్ అధికారి నివేదిత గుప్తా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 6.13 శాతం ఉండగా.. మనదేశంలో ఇది 2.82 శాతం మాత్రమేనని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మనదేశానికి సమానమైన 14 దేశాల్లో కరోనా మరణాలు మన దగ్గరి కంటే 55 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయని ఆయన చెప్పారు. మన దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇక్కడ 72 వేల మందికిపైగా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో 24,586 మంది కరోనా బాధితులు ఉన్నారు. 22,132 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో, 17,617 కేసులతో గుజరాత్ నాలుగో స్థానంలో ఉన్నాయి.


By June 03, 2020 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-19-in-india-8909-fresh-cases-reported-in-india-total-at-2-07-lakh/articleshow/76168822.cms

No comments