Breaking News

కరోనా మృతుల్లో చైనాను దాటేసిన భారత్.. నిన్న ఒక్క రోజే 7వేలకుపైగా కేసులు


చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న కొత్తరకం ప్రాణాంతక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మొత్తం 213 దేశాలపై తన పాదం మోసిన మహమ్మారి వల్ల ప్రపంచానికి కంటిమీద కునుకు కరవయ్యింది. ఇక, భారత్‌లోనూ శరవేగంగా మహమ్మారి వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో 186 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కి చేరగా.. మరణాల సంఖ్య 4,706కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్‌ మొదలైన తర్వాత ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక, కరోనా మరణాల్లోనూ చైనాను భారత్‌ దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 4,634 మంది కరోనా వైరస్‌తో చనిపోగా.. భారత్ ఈ సంఖ్యను దాటేసి, 4,706కి చేరింది. గత పది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదుకావడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా కేసుల్లోనూ ప్రపంచంలో భారత్‌ 9వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకూ 1.60 లక్షల కేసులతో మన కంటే ముందు టర్కీ ఉండగా.. ప్రస్తుతం దానిని అధిగమించింది. పాజిటివ్ కేసుల నమోదు ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో జర్మనీ, ఫ్రాన్స్‌లను దాటి ప్రపంచంలో ఏడో స్థానానికి చేరుతుంది. ప్రస్తుతం 1.82 లక్షల కేసులతో జర్మనీ 8వ స్థానంలో ఉండగా, 1.86 లక్షల కేసులతో ఫ్రాన్స్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే, ఈ దేశాల్లోని మరణాల సంఖ్యతో పోల్చితే భారత్‌లో కాస్త తక్కువే. అలాగే, కోలుకుంటున్నవారి శాతం కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 71,407 మంది కోలుకున్నారు. మరో 80 వేల మందికిపైగా వైరస్‌కు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రంలోనే అత్యధికంగా 60వేల మందికి వైరస్ సోకింది.


By May 29, 2020 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-crosses-china-in-coronavirus-deaths-over-7400-cases-reported-in-last-24-hours/articleshow/76084908.cms

No comments