Breaking News

125కు చేరి కరోనా కేసులు.. చనిపోయిన ఆ ముగ్గురిలో కామన్ పాయింట్ ఇదే!


భారత్‌లో కేసుల సంఖ్య 125 చేరగా.. మరణాల సంఖ్య మూడుకు పెరిగింది. తాజాగా మహారాష్ట్రలో 64 ఏళ్ల వృద్ధుడొకరు కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. ఇటీవలే దుబాయ్ వెళ్లొచ్చిన ఆయన ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఇప్పటి వరకూ కర్ణాటకలో ఒకరు, ఢిల్లీ మరొకరు కరోనా కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. వీరు ముగ్గురూ సీనియర్ సిటిజన్లే కావడం గమనార్హం. మిగతా దేశాల్లోనూ వృద్ధులే ఎక్కువగా కోవిడ్ కారణంగా ప్రాణాలు వదులుతున్న సంగతి తెలిసిందే. కలబుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయనకు చికిత్స అందించిన 63 ఏళ్ల డాక్టర్‌కు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. 76 ఏళ్ల ఆ పేషెంట్‌ను చికిత్స కోసం హైదరాబాద్ కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవలే స్పెయిన్ నుంచి తిరిగొచ్చిన కేరళ డాక్టర్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన సహచర డాక్టర్లు 25 మందిని, మరో 47 మంది స్టాఫ్‌ను ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మహారాష్ట్ర, కేరళల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మధ్య ఆసియా దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య మంగళవారం ఉదయానికి 125గా ఉండగా.. రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం 131 మందికి కరోనా సోకినట్లు తేలింది.


By March 17, 2020 at 11:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-in-india-jumped-to-125-3-dies-with-covid-19-in-the-country/articleshow/74667924.cms

No comments