Breaking News

Covid ఆ నాలుగు నెలల చిన్నారి కరోనాను జయించింది.. 2,239కి చేరిన మృతులు


చైనాలో కరోనా మృతుల సంఖ్య 2,239కి చేరుకోగా, 411 కొత్త కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం మరో 115 మంది మృతిచెందినట్టు వెల్లడించారు. ఒక్క వుహాన్ నగరంలోనే 319 కేసులు నమోదుకాగా, హుబే ప్రావిన్సుల్లోని ఇతర నగరాల్లో 90 కేసులు గుర్తించినట్టు పేర్కొన్నారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 75,567కు చేరింది. కాగా, కరోనా వైరస్‌ను నాలుగు నెలల చిన్నారి జయించింది. తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌‌లోని హాంగ్జూకి చెందిన నాలుగు మాసాల శిశువు జింగ్‌జింగ్‌లో కొద్ది రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ చిన్నారిని ఝేజియాంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో చేర్పించారు. అక్కడి డాక్టర్లు ఆ శిశువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, చికిత్స నిర్వహించారు. ఫిబ్రవరి 20 నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ రావడంతో గురువారం జింగ్‌జింగ్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, కొద్ది రోజుల మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ నుంచి బయటపడి అత్యంత చిన్న వయసున్న బాధితురాలు ఈ శిశువే కావడం విశేషం. ప్రాణాంతక కోవిడ్ వెలుగుచూసిన వుహాన్ నగరంలోనే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. చైనాలో 75,567 కేసులు, మిగతా దేశాల్లో 1,000 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్‌తో చైనాలో 2,239 మంది, మిగతా దేశాల్లో ఏడుగురు చనిపోయారు. వైరస్ సోకిన బాధితుల్లో 18,277 మంది కోలుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, వైరస్ ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. మరోవైపు, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలపై కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావం ఉండదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. చైనా-పాకిస్థాన్‌ ఎకనమిక్ కారిడార్ పనులు ఆగబోవని, పాక్‌తో ఆర్థిక భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరుతుందని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆయన భరోసా ఇచ్చారు. ఖాన్‌తో గురువారం ఆయన ఫోన్లో మాట్లాడారు.


By February 21, 2020 at 11:09AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/four-months-old-patient-infected-with-coronavirus-discharged-from-hospital-in-china/articleshow/74236959.cms

No comments