Breaking News

తమ బిడ్డకు హిందూ సంప్రదాయం ప్రకారం.. గుళ్లో పెళ్లి చేసిన ముస్లిం జంట


కేరళలోని ఓ ముస్లిం జంట.. హిందువైన తమ పెంపుడు కుమార్తెకు గుళ్లో పెళ్లి జరిపించి పరమత సహనాన్ని చాటారు. ఆదివారం కాసరగోడ్‌లోని భగవతి ఆలయంలో ఈ వివాహ మహోత్సవం జరిగింది. రాజేశ్వరి మెడలో విష్ణు ప్రసాద్ తాళికట్టగా.. ఈ వేడుకలో హిందువులతోపాటు ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజేశ్వరి తమిళనాడులోని తంజావూరులో పుట్టింది. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దీంతో బతుకుదెరువు కోసం తండ్రి వలసపోయాడు. అబ్దుల్లా అనే ముస్లిం వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్‌లో పనికి కుదిరాడు. కొంత కాలానికి ఆయన కూడా కాలం చేశాడు. దీంతో అబ్దుల్లా, ఖాదీజా దంపతులు రాజేశ్వరీ బాధ్యతలు తీసుకున్నారు. తమ ముగ్గురు కొడుకులతోపాటు రాజేశ్వరిని పెంచి పెద్ద చేశారు. పెళ్లవగానే.. తనను పెంచి పెద్దదాన్ని చేసి.. పెళ్లి చేసిన అమ్మ ఖాదిజా కాళ్లకు రాజేశ్వరి నమస్కరించింది. వెంటనే ఆ తల్లి తన బిడ్డ తల మీద చేతిని పెట్టి ప్రేమతో ఆశీర్వదించింది. వధువేమో సంప్రదాయ హిందూ వస్త్రాల్లో, ఆమె తల్లి బుర్ఖాలో.. ఈ దృశ్యం అక్కుడున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. పరమత సహనానికి అసలు సిసలైన నిర్వచనం ఇదేనంటూ వివాహానికి హాజరైన వారు మురిసిపోయారు. ముస్లింలై ఉండి తాము పెంచుకున్న బిడ్డ మతాన్ని గౌరవించి... హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిన చేసిన అబ్దుల్లా దంపతులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు ఈ ఏడాది జనవరిలో కేరళలోని ఓ మసీదులో.. నిరుపేద హిందూ యువతి పెళ్లి జరిపిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలు పరమత సహనానికి అద్దం పడుతున్నాయి. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న వేళ.. ఇదీ మన దేశం అంటే.. ఇదీ కేరళ అంటే.. ఇది సెక్యూలరిజం అంటే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


By February 21, 2020 at 11:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-muslim-couple-marries-off-their-hindu-foster-daughter-in-temple/articleshow/74237203.cms

No comments