Breaking News

పాక్ అనుకూల నినాదాలు.. యువతిపై దేశద్రోహం కేసు.. చర్యలు తీసుకోవాలన్న తండ్రి


పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా బెంగళూరు నగరంలో నిర్వహించిన సభలో లియోనా అనే యువతి పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీతోపాటు మిగతా వారు.. ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేయకుండా ఆ యువతిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆమెను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 124ఏ కింద అమూల్యపై దేశద్రోహం కేసు పెట్టామని పోలీసులు తెలిపారు. అమూల్యను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. శుక్రవారం ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. గతంలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలోనూ అమూల్యను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన విషయమై అమూల్య తండ్రి స్పందించారు. ఆమె చేసింది తప్పన్నారు. తన మాటలు వినకుండా ఆమె కొందరు ముస్లింలతో చేరిందని ఆయన ఏఎన్ఐతో తెలిపారు. ఆమెకు బెయిల్ కోసం తాను ఎలాంటి ప్రయత్నాలు చేయబోనన్నారు. అమూల్య పాకిస్థాన్‌ను అనుకూలంగా నినాదాలు చేసిందనే వార్త ప్రచారంలోకి రావడంతో.. చిక్కమంగళూరులోని ఆమె తండ్రి ఇంటిపై కొందరు దాడి చేశారు. దీంతో వారిపైనా కేసులు నమోదు చేశారు. అమూల్య వ్యాఖ్యలను మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. తాము భారతీయులుగా గర్విస్తున్నామన్న ఒవైసీ.. అమూల్య వ్యాఖ్యల వెనుక నేను ఉన్నానని బీజేపీ ఆరోపించే అవకాశం ఉందన్నారు. కానీ ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.


By February 21, 2020 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/student-shouts-pro-pak-chant-at-bengaluru-event-her-father-calls-for-action-against-her/articleshow/74236693.cms

No comments