ఢిల్లీ ఘర్షణలు.. 20కి చేరిన మరణాలు.. ఆర్మీని పంపాలన్న కేజ్రీవాల్, రంగంలోకి ధోవల్

ఢిల్లీ: సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరింది. బుధవారం జీటీబీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13 నుంచి 20కి పెరిగింది. ఈ ఘర్షణల కారణంగా ఈశాన్య ఢిల్లీలోని 86 కేంద్రాల్లో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఘర్షణలను తీవ్రంగా తీసుకున్న హోం మంత్రి అమిత్ షా.. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీలో పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ భద్రతా సలహాదారు రంగంలోకి దిగారు. సరిపడా బలగాలు ఢిల్లీలో ఉన్నాయని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని శీలంపూర్ ఏరియాకు వెళ్లిన ధోవల్ పరిస్థితిని సమీక్షించారు. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ, కేబినెట్కు ధోవల్ ఢిల్లీలోని పరిస్థితి గురించి వివరించనున్నారు. ఢిల్లీ ఘర్షణల్లో 18 మంది మరణించడం, 150 మందికిపైగా గాయపడటం పట్ల సీఎం కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. ఘర్షణలను నియంత్రించడానికి వెంటనే ఆర్మీని రంగంలోకి దింపాలని ఆయన కేంద్రాన్ని కోరారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేలేకపోతున్నారని ఆయన తెలిపారు. కాగా ఢిల్లీ ఘర్షణల విషయమై హైకోర్టు సీరియస్ అయయింది. రాజధాని పరిణామాలపై న్యాయస్థానం బుధవారం మధ్యాహ్నం విచారణ జరపనుంది.
By February 26, 2020 at 11:24AM
No comments