Breaking News

వుహాన్‌లో చిక్కుకున్న 25 మంది భారతీయులు.. సింగ్‌పూర్, వియత్నాంలకు పాకిన వైరస్


ప్రాణాంతక చైనావాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కరోనా వైరస్ తొలి కేసు వుహాన్ నగరంలో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 18 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 600 మందికి ఇది సోకినట్టు గుర్తించారు. దీంతో చైనాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. కొత్త ఏడాది సెలవులు జనవరి 24 నుంచి ప్రారంభం కానుండటంతో లక్షలాది మంది ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వుహాన్ నగరంలో ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. తాజాగా వైరస్ సింగ్‌పూర్, వియత్నాంలకు పాకినట్టు గుర్తించారు. కరోనా వైరస్‌ బయటపడిన వుహాన్‌ నగరంలో ప్రజా రవాణాను గురువారం ఉదయం నుంచి అధికారులు పూర్తిగా నిలిపివేశారు. నగరంలోని ప్రజలు బయటకు వెళ్లకుండా, బయటివారు లోపలికి రాకుండా విమానాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. బహిరంగ కార్యకలాపాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన అధికారులు... కాన్ఫరెన్స్‌లు, పర్యటనలు, సమూహాలను నిషేధించారు. ఫిబ్రవరి 8 వరకు ఎలాంటి పర్యటనలు చేపట్టొదని స్థానిక టూరిజం ఏజెన్సీలను అధికారులు ఆదేశించారు. వుహాన్‌లో ప్రజా రవాణాను నిలిపివేయడంతో 25 మంది భారతీయ విద్యార్ధులు చైనాలో చిక్కుకున్నారు. వీరిలో 20 మంది కేరళకు చెందినవారు. వీరంతా మెడిసిన్ విద్యార్థులు కాగా, 14 మంది యచాంగ్ హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. వుహాన్‌లోని కున్‌మింగ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఈ విద్యార్థులు.. అక్కడ నుంచి గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం కోల్‌కతాకు వచ్చేందుకు ప్రయత్నించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పరిగణనలోకి తీసుకుని చైనాలో పరిస్థితి నిశితంగా గమనిస్తున్నామని, వుహాన్‌లో నివాసితులకు ఆహారం సహా అన్ని రకాల సహాయం అందజేస్తామని చైనా అధికారులు హామీ ఇచ్చారని బీజింగ్‌లో భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. అంతేకాదు, హుబే ప్రావిన్సుల్లో ఉండే భారతీయుల క్షేమ సమాచారం గురించి భారత్‌లోని వారి బంధువులు తమ ఇప్పటికే సంప్రదించినట్టు పేర్కొంది. రాయబార కార్యాలయంలో సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసి +8618612083629, +8618612083617 పై నెంబర్లకు ఫోన్‌చేసి సంప్రదించాలని సూచించారు. చైనా పర్యటనకు వెళ్లిన ఐదుగురు భారతీయుల్లో మిగిలిన ఇద్దరు గురవారం ముంబై చేరుకున్నారు. వీరికి వైద్య పరీక్షల కోసం కస్తూర్బా హాస్పిటల్‌లో చేర్పించినట్టు అధికారులు తెలియజేశారు. స్వల్ప జలుబు, దగ్గుతో ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్‌ చేరారని, అయితే వారికి ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదని ముంబయి అధికార వర్గాలు పేర్కొన్నాయి. రెండు రోజుల కిందట చైనా నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికుల్లో ముగ్గురు ముంబైలోని జోగేశ్వరి, కళ్యాణ్, నల్సాపొరాకు చెందినవారు కాగా, ఇద్దరు పుణేకు చెందిన వ్యక్తులని తెలిపారు.


By January 24, 2020 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/25-indian-students-trapped-in-wuhan-coronavirus-reaches-singapore-vietnam/articleshow/73571321.cms

No comments