Breaking News

నేడే మహా బలపరీక్ష.. సీఎంగా ఉద్ధవ్‌కు తొలి పరీక్ష


మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మహా సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే శనివారం తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో నేడు బలపరీక్ష నిర్వహిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబకర్‌ను గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా నియమించగా, ఆయన స్థానంలో ఎన్‌సీపీ సీనియర్ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్‌ను శుక్రవారం నియమించారు. అత్యవసరంగా క్యాబినెట్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే స్పీకర్ ఎన్నికకు కూడా శనివారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎన్నిక ఆదివారం జరగనుంది. ఇదో రోజు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. దీనికి ముందే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రొటెం స్పీకర్‌గా నియమించిన ఎన్‌సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ గతంలో స్పీకర్‌గా పనిచేశారు. అసెంబ్లీలో విశ్వాసతీర్మానంపై ఓటింగ్ నిర్వహించే అంశం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. మూజువాణి ఓటు లేదా ఓటింగ్ నిర్వహించడం అనేది ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. మెజారిటీ సభ్యులు మూజువాణికి అనుకూలంగా ఉన్నారని భావిస్తే దీనికే మొగ్గుచూపవచ్చు. కానీ, మెజారిటీ సభ్యులు ఓటింగ్ కోరితే దీనినే అనుసరించవచ్చు. తమ ఎమ్మెల్యే స్థానంలో ప్రొటెం స్పీకర్‌గా దిలీప్‌ను నియమించడం బీజేపీ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బలపరీక్ష సమయంలో ప్రత్యేక సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారని ఆ పార్టీ భావించింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమిలో శివసేనకు 56 మంది, ఎన్‌సీపీకి 54 మంది, కాంగ్రెస్‌కు 44 మంది, చిన్న పార్టీలు, స్వతంత్రులు 12 మంది మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బలపరీక్షలో ఇరు వర్గాలకు ఓట్లు సమానంగా వస్తే ప్రొటెం స్పీకర్ ఓటు కీలకం కానుంది.


By November 30, 2019 at 08:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/after-a-colourful-swearing-in-ceremony-maharashtra-cm-uddhav-thackeray-faces-floor-test-today/articleshow/72302352.cms

No comments