Breaking News

Chandrababu Naiduని మాజీ ముఖ్యమంత్రి అనొద్దు: మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు


ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత కొంత కాలంపాటు సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు.. మళ్లీ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. గురు, శుక్రవారాల్లో విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. గత కొంత కాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టు ఉంటున్న గంటా శ్రీనివాస రావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి, జగన్‌కు చురకలు అంటించి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిని మాజీ సీఎం అనొద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ మాటగానే.. ముఖ్యమంత్రి అనాలంటూ.. అక్కడున్న కార్యకర్తలు గట్టిగా అరిచారు. చంద్రబాబును ఓడించినందుకు తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని మాజీ మంత్రి తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా.. చంద్రబాబుకు అన్యాయం జరిగింది బాబోయ్.. అని ఆడవాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు తమ పార్టీకే ఉన్నాయన్నారు. ఆగస్టు నెలలో టీడీపీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అయ్యన్న పాత్రుడు పార్టీ అధినేత చంద్రబాబుతో విబేధించారు. రెండు నెలలకే జగన్ సర్కారును విమర్శిస్తూ.. జనంలోకి వెళ్లి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సర్కారు తీరుతో జనం ఒకింత విసుగు చెందాకే జనంలోకి వెళ్దామని ఆయన టీడీపీ అధినేతకు సలహా ఇచ్చారు. అంతకు ముందు జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో అయ్యన్న భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా.. ప్రజలు మాత్రం జగన్‌కే ఓటేశారంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబును ఓడించి తాము తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు భావిస్తుంటే.. అయ్యన్న పాత్రుడి సోదరుడు మాత్రం టీడీపీకి ఎందుకు రాజీనామా చేసినట్టో?


By October 11, 2019 at 08:40AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/visakhapatnam-tdp-review-meeting-ex-minister-chintakayala-ayyanna-patrudu-interesting-comments-on-chandrababu-naidu/articleshow/71533190.cms

No comments