Breaking News

మీడియాపై కేసులు.. తండ్రి వైఎస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న జగన్


సర్కారు తప్పుడు కథనాల పట్ల కఠిన వైఖరిని అవలంభించాలని నిర్ణయించింది. తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని సంబంధిత శాఖల కార్యదర్శులకు అప్పగించింది. ఉదాహరణకు ఆర్థిక శాఖలో అవినీతి అంటూ.. ఏదైనా మీడియా సంస్థలో వచ్చింది తప్పుడు కథనమని తేలితే.. సంబంధిత శాఖ కార్యదర్శి వెంటనే రంగంలోకి దిగి కేసు పెట్టొచ్చు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పేర్ని నాని ప్రతిపాదనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇప్పటి వరకూ కేసులు పెట్టే అధికారం సమాచార ప్రసార శాఖలోని ప్రత్యేక కార్యదర్శులకు మాత్రమే ఉంది. ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కార్యదర్శికి న్యాయపరంగా మందుకెళ్లే అవకాశం కల్పిస్తూ.. 12 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్ణయం తీసుకున్నారు. 2007 ఫిబ్రవరి 20న ఈ మేరకు జీవో తీసుకొచ్చారు. అప్పుడు వైఎస్ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా జగన్ వెనక్కి తీసుకున్నట్టయ్యింది. జగన్ నిర్ణయంతో.. ప్రభుత్వ ‘పరువుకు భంగం కలిగించే’ వార్తలపై సంబంధిత శాఖల అధికారులు స్పందించి 24 గంటల్లోగా న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా సంబంధిత కోర్టులో కేసులు వేయడానికి వీలవుతుంది. ఉద్దేశపూర్వకంగా సర్కారుకు వ్యతిరేకంగా వార్తలను రాసే కొన్ని మీడియా సంస్థల దూకుడుకు కళ్లెం వేయడానికి జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. ఓ పత్రికకు గతంలో చంద్రబాబు సర్కారు విశాఖలో ఇచ్చిన 1.5 ఎకరాల భూమిని కూడా వెనక్కి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. వాస్తవానికి మీడియాలో తప్పుడు కథనాలు వస్తే.. ప్రభుత్వమే కాదు సామాన్యులు సైతం కేసులు వేయొచ్చు. ప్రభుత్వం సరైన మార్గంలో వెళ్లడానికి, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి మీడియాలోని కథనాలు ఉపయోగపడతాయి. కానీ ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేసి కేసులు వేసే పరిస్థితి తలెత్తితే మాత్రం మీడియా స్వేచ్ఛను హరించినట్టే. గతంలో జగన్‌కు వ్యతిరేకంగా పత్రికలు, న్యూస్ ఛానెళ్లలో కథనాలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. విపక్షంలో ఉన్నప్పుడు జగన్‌పై ఎంత దుష్ప్రచారం జరిగినా.. ప్రజాతీర్పు అంతిమంగా ఆయనకే అనుకూలంగా వచ్చింది. అప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియాను చూసి వెరవని జగన్.. తనపై జరిగిన దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టిన జగన్.. ఇప్పుడు ఆ మీడియా విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందనేది కొందరి వాదన.


By October 17, 2019 at 12:39PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/jagan-reverses-ysr-decision-govt-empowers-secretaries-to-sue-media-houses-for-false-stories/articleshow/71627782.cms

No comments