Breaking News

మళ్లీ బరితెగించిన పాక్ సైన్యం.. ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడు మృతి


సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో పాక్ సైన్యం కాల్పులకు ఆదివారం ఉదయం తెగబడటంతో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. తంఘర్ సెక్టార్‌లో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారత పోస్టులు, జనావాసాలే లక్ష్యంగా పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. పాక్ దుశ్చర్యకు పాల్పడటంతో భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. పాక్ సైన్యం దాడులను సమర్ధంగా తిప్పికొడుతోంది. వారం రోజుల కిందట నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిని భారత దళాలు ధీటుగా తిప్పికొట్టాయి. బారాముల్లా, ఉరి సెక్టర్‌లో భారత స్థావరాలపై పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాను తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దుచేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఐరాస మానవ హక్కుల మండలిలో పాక్‌ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలతో సహా భారత్ బదులిచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 2050సార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ ఘటనల్లో 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. జులైలో 296 సార్లు, ఆగస్టులో 307 సార్లు, సెప్టెంబరులో 292 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.


By October 20, 2019 at 10:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-soldiers-and-one-civilian-killed-in-ceasefire-violation-by-pak-army-in-jammu-and-kashmir/articleshow/71670881.cms

No comments