Abdul Kalam జయంతి: తెలుగోడితో కలిసి హార్ట్ స్టంట్ రూపకల్పన.. మిస్సైల్ మ్యాన్ జీవిత విశేషాలు

అబ్దుల్ కలామ్.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడంటే ఆశ్చర్యం లేదు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఆయన. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత ప్రస్థానం నిజంగా అద్భుతం. దేశం కోసం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆయన.. అనితర సాధ్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అక్టోబర్ 15న ఆయన జయంతి సందర్భంగా కలాం జీవితం గురించి క్లుప్తంగా.. 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో కలాం జన్మించారు. 1958లో మద్రాస్ ఐఐటీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. భారత వాయుసేనలో ఫైటర్ పైలట్ కావాలనేది కలాం కోరిక. ఐఏఎఫ్లో 8 సీట్లే ఉండగా.. కలాం 9వ స్థానంలో నిలిచారు. దీంతో కొద్దిలో ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఆయన డీఆర్డీవోలో చేరారు. 1969లో ఇస్రోకు బదిలీ అయ్యారు. భారతదేశ తొలి స్వదేశీ ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎల్వీ III ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన వ్యవహరించారు. 1963-64 మధ్య కలాం నాసా రీసెర్చ్ సెంటర్ను సందర్శించారు. 1970-90 మధ్య పీఎస్ఎల్వీ రూపకల్పన కోసం శ్రమించారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా.. అగ్ని, పృథ్వీ మిస్సైళ్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. దేశానికి తొలి మిస్సైల్ను అందించిన ఘనత కలాందే. అందుకే ఆయన్ను ‘‘మిస్సైల్ మాన్’’ అని పిలుస్తారు. కలాం 1992లో రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. 1992-99 మధ్య డీఆర్డీవో సెక్రటరీగా వ్యవహరించారు. ఈ సమయంలోనే పోఖ్రాన్-2 అణు పరీక్షలను నిర్వహించారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు. 1998లో తెలుగు వారైన ప్రముఖ కార్డియాలజిస్ట్ భూపతిరాజు సోమరాజుతో కలిసి కరోనరీ స్టంట్ను కలాం రూపొందించారు. దీనికి కలాం-రాజు స్టంట్ అని పేరుపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కోసం కలాం-రాజు ట్యాబ్లెట్ పేరిట ట్యాబ్లెట్ కంప్యూటర్ను రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోమరాజు.. ప్రస్తుతం కేర్ హాస్పిటల్స్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దేశానికి ఆయన 11వ రాష్ట్రపతిగా కలాం వ్యవహరించారు. ఎన్డీయే హయాంలో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఎన్డీయే ప్రతిపాదించగా.. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. 2002లో రాష్ట్రపతి అయిన కలామ్.. అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని గడిపారు. రాష్ట్రపతి పదవీ కాలం ముగిశాక కలాం తనకు ఇష్టమైన బోధన రంగం వైపు మళ్లారు. కలాం తన 83వ ఏట చనిపోయారు. 2015 జూలై 27న ఐఐఎం షిల్లాంగ్లో విద్యార్థులకు పాఠాలు చెబుతూ వేదిక మీదే ఆయన కుప్పకూలారు.
By October 15, 2019 at 10:18AM
No comments