Breaking News

INX Media Case.. చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!


ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరం దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ఆగస్టు 26 వరకు అరెస్ట్ చేయరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, సీబీఐ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై మాత్రం విచారణను ఆగస్టు 26కి వాయిదా వేసింది. దీంతో సీబీఐ కేసులో తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. అయితే, ఇప్పటికే సీబీఐ అదుపులోకి తీసుకుందని, ఈ విషయంలో తాము జోక్యంచేసుకోలేమని స్పష్టం చేసింది. చిదంబరం ఇప్పటికే అరెస్ట్ అయ్యారన్న సుప్రీం, ఈ కేసు అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాదు సాధారణ బెయిల్ కోసం ట్రయిల్ కోర్టును సంప్రదించాలని స్పష్టం చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టు పరిశీలన ప్రభావం లేకుండా బెయిల్‌పై దిగువ కోర్టు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. అంతకు ముందు చిదంబరం తరఫున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సవాల్ చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, సీబీఐ, ఈడీలు ఎలా అరెస్ట్ చేస్తాయని కోర్టుకు తెలిపారు. చిదంబరం పిటిషన్‌లో ఎలాంటి అస్పష్టతలేదని, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన రోజే సుప్రీంకోర్టును ఆశ్రయించారని మరో న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. గత బుధవారం రాత్రి హై డ్రామా నడుమ చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ గురువారం ఆయన్ను సీబీఐ కోర్టు ముందు హాజరుపర్చింది. ఈ కేసు విషయంలో సీబీఐ కోర్టులో చిదంబరం మాట్లాడుతూ.. తనకు ఇంద్రాణి ముఖర్జియా తెలీదన్నారు. తన కుమారుడికి మాత్రమే విదేశాల్లో బ్యాంకు అకౌంట్ ఉందని, తనకు లేదని అన్నారు. ఈ కేసు వల్ల గత 24 గంటలు నిద్రలేకకుండా గడిపానని చెప్పారు.


By August 26, 2019 at 12:46PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-dismisses-congress-leader-chidambarams-plea-in-cbi-case/articleshow/70838564.cms

No comments