Breaking News

బీమా సొమ్ము కోసం పక్కా ప్లాన్‌తో చంపించిన యజమాని.. ఆ సినిమా స్ఫూర్తితో హత్య!


ఎవరూ లేని తనను ఓ వ్యక్తి అక్కున చేర్చుకుంటే... యజమానే దేవుడనుకొని అతడు విశ్వాసంగా పని చేశాడు. కానీ ఆ దేవుడే యముడయ్యాడు. బీమా సొమ్ము కోసం పథకం ప్రకారం హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. నాలుగేళ్ల తర్వాత ఓ ఫోన్ కాల్ ద్వారా పోలీసులు ఇది రోడ్డు ప్రమాదం కాదు.. యజమాని చేయించిన హత్య అని తేల్చారు. వివరాల్లోకి వెళ్తే జిల్లా అవుకు ప్రాంతానికి చెందిన సుబ్బారాయుడికి ఎవరూ లేరు. దీంతో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి అతణ్ని చేరదీశాడు. అతడు భాస్కర్ రెడ్డి దగ్గరే నమ్మకంగా పని చేస్తుండేవాడు. కొద్ది రోజుల తర్వాత భాస్కర్ రెడ్డి సుబ్బారాయుడి పేరిట ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం పక్కా స్కెచ్ ప్రకారం అతడిని చంపించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. పోలీసులు కూడా యాక్సిడెంట్‌గానే కేసు నమోదు చేసుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత సుబ్బారాయుడి చనిపోయింది యాక్సిడెంట్లో కాదు, అతణ్ని హత్య చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును తిరగదోడారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. విస్తుగొల్పే వాస్తవాలను వాళ్లు బయటపెట్టారు. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం కోసం సొంత యజమానే ఈ హత్య చేయించాడని, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని పోలీసులు తెలుసుకున్నారు. సుబ్బారాయుడిని చంపించాక.. వచ్చిన రూ. 32 లక్షల ఇన్సూరెన్స్ సొమ్మును యజమాని కాజేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఎవరూ లేరని తెలిసి, నమ్మించి చేరదీసి, ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపించాడన్ని చూస్తుంటే.. 2004లో వచ్చిన ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా’ సినిమా స్ఫూర్తితో భాస్కర్ రెడ్డి ఈ హత్యకు ప్లాన్ చేశాడేమో అనిపిస్తోంది.


By August 25, 2019 at 05:35PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/kurnool-police-reveals-subbarayudu-murder-mystery-after-4-years/articleshow/70828552.cms

No comments