Breaking News

జైట్లీ అంత్యక్రియలు ముగింపు.. కన్నీటి సంద్రమైన బోధ్ ఘాట్‌


కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డునున్న బోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అనంతరం జైట్లీ చితికి కుమారుడు రోహన్‌ నిప్పంటించారు. అంత్యక్రియలకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య.. కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ, ఇతర పార్టీల నేతలు జైట్లీకి చివరి సారిగా నివాళులు అర్పించారు.. జైట్లీకి తుది వీడ్కోలు పలికారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఉండటంతో అంత్యక్రియలకు రాలేకపోయారు. ఆదివారం ఉదయం నివాసం నుంచి ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు జైట్లీ భౌతికకాయన్ని తరలించారు. అక్కడ నేతలు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం పార్టీ కార్యాలయం నుంచి అంతిమ యాత్ర జరిగింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ అభిమాన నేతకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చారు. యమునా నది ఒడ్డువరకూ అంతిమయాత్ర కొనసాగింది. అరుణ్ జైట్లీ అనారోగ్యంతో శనివారం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆగష్టు 9న ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించారు. 15 రోజులపాటు చికిత్స పొందిన ఆయన.. ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. జైట్లీ ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు శతథా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డయాబెటిస్ కారణంగా బాగా బరువు పెరిగిపోయిన జైట్లీ 2014లో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. 66 ఏళ్ల జైట్లీ గత ఏడాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. ఆయనకు క్యాన్సర్ రావడంతోనే చికిత్స కోసం జనవరిలో అమెరికా వెళ్లారని ప్రచారం జరిగింది.


By August 25, 2019 at 03:57PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/senior-bjp-leader-and-former-union-minister-arun-jaitley-cremated-with-state-honours/articleshow/70827632.cms

No comments