ఏపీ, తెలంగాణకు వేర్వేరు గవర్నర్లు.. నరసింహన్కు కీలక పదవి?

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ఉమ్మడి గవర్నర్నే కొనసాగిస్తున్నారు. అంధ్రప్రదేశ్, తెలంగాణకు గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించనున్నారు. ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందని వర్గాలు అంటున్నాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత గవర్నర్ల నియమాకం జరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. విజయవాడలో ఇదివరకు ముఖ్యమంత్రి ఆఫీసుగా ఉన్న దానిని గవర్నర్ కార్యాలయంగా తీర్చిదిద్దే పనులు సాగుతున్నాయి. ఈ ఆఫీసులోనే ఏపీ గవర్నర్ కొలువుతీరే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. విభజన చట్టంలో హైదరాబాద్ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేయడంతో ఒకే గవర్నర్ను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ 2009 డిసెంబరు నుంచి కొనసాగుతున్నారు. కాగా ఏపీ, తెలంగాణలు పూర్తిగా వాటి భూభాగాల నుంచి పరిపాలన సాగిస్తుండటం, హైకోర్టు కూడా విభజన జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్లను వేరుగా నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత గవర్నర్ దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్నారని, ఆయనను ఇంకా కొనసాగించడం బాగుండదన్న ఉద్దేశంతో హోంశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. నరసింహన్ను బదిలీ చేయడమో, జమ్మూ కశ్మీర్ వ్యవహారాల సలహాదారుగా నియమించడం జరుగుతుందని హోంశాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుత గవర్నర్ మార్పునకు ప్రయత్నిస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా వేర్వేరు గవర్నర్లను నియమించాలని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే కొత్త గవర్నర్ల నియామకం జరగొచ్చని హోంశాఖ వర్గాలు అంటున్నాయి. ఏపీకి సుష్మా స్వరాజ్ను గవర్నర్గా నియమించినట్టు గత నెలలో సామాజిక మాధ్యమాల్లో ముమ్మురంగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే.
By July 02, 2019 at 08:59AM
No comments