Breaking News

ముంబైలో భారీ వర్షాలు.. గోడ కూలి 16 మంది మృతి


ముంబైలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు 16 మందిని పొట్టునబెట్టుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న కట్టడాలు కూలుతున్నాయి. తాజాగా మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాదలో గోడకూలి 12 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రులు కాండ్వాలీలోని శతాబ్ది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ముంబై సమీపంలోని కల్యాణ్‌లో పాఠశాల గోడ కూలి ఓ మూడేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగుర్ని సురక్షితంగా బయటకు తీశారు. మరోవైపు, భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. పురాతన భవనాలు పక్క గుడిసెల్లో నివస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోకల్ రైళ్లను నిలిపివేశారు. 54 విమాన సర్వీసులను సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. గతేడాది నల్లాస్‌పొరలో 72 గంటల పాటు 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా దీన్ని ప్రస్తుత వర్షాలు అధిగమించాయి. గడిచిన 72 నుంచి 75 గంటల్లో 1000 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 200 మి.మీ. అధికం. ముంబైలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముంబైలోని రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. కింగ్ సర్కిల్‌లో వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. జులై 3 నుంచి 5 వరకు ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రయివేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ హెచ్చరికలు జారీచేసింది.


By July 02, 2019 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sixteen-people-were-killed-in-two-separate-incidents-of-wall-collapse-in-mumbai-and-kalyan/articleshow/70034261.cms

No comments