Breaking News

జగన్ అక్రమాస్తుల కేసు.. అప్పిలేట్ అథారిటీ కీలక ఆదేశాలు!


జగన్‌ అక్రమాస్తుల కేసులో పలు సంస్థలకు ఊరట లభించింది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేపట్టిన ఆస్తుల జప్తును రద్దు చేసింది. దీంతో పెన్నా సిమెంట్స్‌, పయనీర్‌ హాలిడే రిసార్ట్స్‌, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ సహా దాని యజమాని జితేంద్ర వీర్వాణిలకు ఉపశమనం కలిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతాప్‌రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్‌కు, పయనీర్‌ హోటళ్లకు చేకూర్చిన లబ్ధికిగాను అవి క్విడ్ ప్రోకో కింద జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే అభియోగంతో వాటి ఆస్తులను జప్తుచేసిన విషయం తెలిసిందే. మొత్తం రూ.53 కోట్ల పెట్టుబడులను జగన్‌ కంపెనీల్లో పెట్టినట్టు ఈడీ అభియోగాలు నమోదుచేసింది. అయితే, ఈ అభియోగంపై ప్రత్యక్షంగా ఎలాంటి ఆధారాలూ లేవని అప్పీలేట్‌ అథారిటీ స్పష్టం చేసింది. అంతేకాదు, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలను ఎక్కువకాలం జప్తులో ఉంచరాదని, వీటిపై వందలాది మంది ఉద్యోగులు ఆధారపడి ఉంటారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అవసరమైతే ఆ మేరకు డిపాజిట్‌లను స్వీకరించవచ్చని, యాడికిలోని 231.09 ఎకరాల భూమిని ఈడీ తన వద్ద ఉంచుకోరాదని తెలిపింది. అదేవిధంగా జప్తు చేసిన విలువకు రూ.6.69 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను తీసుకుని పయనీర్‌ హోటల్‌ అంతస్తులను అప్పగించాలంటూ ఈడీని ఆదేశించింది. కోర్టులో కేసు తేలేదాకా జప్తు కొనసాగుతుందని, ఆస్తులను స్వాధీనం చేసుకోరాదని ఈడీని ఆదేశించింది. హైదరాబాద్‌, నంద్యాలల్లో హౌసింగ్ బోర్డుతో కలిసి ఇందూ గ్రూపు చేపట్టిన హౌసింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంలో ఈడీ జప్తు చేసిన ఆస్తులను వాపసు చేయాలని అప్పిలేట్ అథారిటీ ఆదేశించింది. ఎంబసీ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌కు చెందిన రూ.25.05 కోట్లు, దాని యజమాని జితేంద్ర వీర్వాణిలకు చెందిన రూ.19 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా ప్రతాపరెడ్డికి చెందిన రూ.7.85 కోట్ల ఆస్తులను మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద 2015లో ఈడీ జప్తు చేసింది. బంజారాహిల్స్‌లోని రూ.6.70 కోట్ల విలువైన పయనీర్‌ హాలిడే రిసార్ట్‌తోపాటు అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరు ప్రాంతంలో రూ.1.16 కోట్ల విలువైన 232 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. వైఎస్‌ ప్రభుత్వం నుంచి పొందిన లబ్దికి బదులుగా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రతాపరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామం వద్ద నిర్మించిన పెన్నా సిమెంట్స్‌కు 2007లో నాటి సీఎం వైఎస్‌ 232 ఎకరాల భూములను కేటాయించారు. అనంతరం జగన్‌కు చెందిన కంపెనీల్లో ప్రతాపరెడ్డి రూ.68 కోట్లు పెట్టుబడుల రూపంలో ప్రతిఫలాలను అందించినట్లు సీబీఐ నాంపల్లి చార్జిషీట్‌ దాఖలు చేసింది.


By July 14, 2019 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/appellate-authority-order-to-ed-to-release-freezed-assets-in-ys-jagan-disproportionate-assets-case/articleshow/70211931.cms

No comments