Breaking News

పంజాబ్‌లో తాడిపత్రి విద్యార్థి ఆత్మహత్య


పంజాబ్‌లోని జలంధర్‌లో గల లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి సోమ భరత్‌ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల రాసిన పరీక్షల్లో అనుకున్నట్లుగా మార్కులు రాకపోవడంతోనే మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని భరత్ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. అనంతపురం జిల్లా యాడికి మండలం గుడిపాడుకుచెందిన శ్రీనివాస్, రమాదేవి దంపతులు కొన్నాళ్ల క్రితమే తాడిపత్రికి వచ్చి సీపీఐ కాలనీలో నివసిస్తు్న్నారు. వీరికి ముగ్గురు కుమారులు. శ్రీనివాస్ నాపరాయి గనులను లీజ్ తీసుకుని పనులు చేయిస్తుంటాడు. ముగ్గురు కుమారులను ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్న ఆయన అందరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నారు. చిన్నవాడైన భరత్ పదో తరగతి కర్నూలులోని మాంటిస్సోరిలో, ఇంటర్ విజయవాడలోని శ్రీచైతన్య కాలేజీలో చదివాడు. ప్రస్తుతం పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో బీటెక్ ఈసీఈ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. పెద్దకుమారుడు శ్రీకాంత్‌ కూడా ఏజీ బీఎస్సీ లవ్‌లీ యూనివర్సీటీలోనే పూర్తి చేసి ప్రస్తుతం నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం సాధించాడు. రెండో కుమారుడు సందీప్‌ అదే విశ్వవిద్యాలయంలో ఏజీ బీఎస్సీ పూర్తి చేసి హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. యూనివర్శిటీలో ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఓ సబ్జెక్టులో భరత్‌కు గ్రేడ్ తక్కువగా వచ్చింది. దీంతో తల్లిదండ్రులు అతడిని ఫోన్‌లో వారించారు. అధైర్య పడొద్దని, మరోసారి రాసి మంచి గ్రేడ్ తెచ్చుకోవాలని సూచించారు. శనివారం యూనివర్శిటీ ప్రతినిధులు శ్రీనివాస్‌కు ఫోన్ భరత్ బిల్డింగ్‌ పైనుంచి దూకి చనిపోయాడని చెప్పడంతో అంతా షాకయ్యారు. ‘హాస్టల్‌ గదుల్లో ఒంటరిగా ఉండొద్దు. ఉంటే నాలాగే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. కనీసం ఒక గంట ఆడుకోవడానికి వెళ్లండి’ భరత్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను భరత్ వమ్ము చేస్తూ ఆత్మహత్యకు పాల్పడటం వారి కుటుంబంలో విషాదం నింపింది.


By July 14, 2019 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tadipatri-btech-student-commits-suicide-in-punjab-lovely-professional-university/articleshow/70211980.cms

No comments