Breaking News

ఎమ్మెల్యేలకు క్లాస్.. జగన్ కీలక సూచనలు


శాసనసభలో సభ్యులు అనుసరించాల్సిన విధానం, నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతోన్న ఈ తరగతుల్లో స్పీకర్ తమ్మినేని సీతారం మాట్లాడుతూ.. శాసనసభ నిర్వహణ విజయవంతానికి సభ్యులకు శిక్షణ అవసరమని అన్నారు. అసెంబ్లీ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సభా సమయాన్ని వృథా చేయడం మంచిది కాదని, బహిరంగ సభల్లో మాట్లాడే తీరు, అసెంబ్లీలో మాట్లాడే విధానం వేరుగా ఉండాలని స్పీకర్ తెలిపారు. సభా కాలాన్ని వినియోగించుకొని మంచి సభ్యులుగా పేరు తెచ్చుకోవాలని, ప్రజాస్వామ్యం బలపడాలంటే అర్థవంతమైన చర్చలు జరగాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సభలో నియమ, నిబంధనలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. చంద్రబాబుకు అబద్దాలు చెప్పడం అలవాటని, గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎల్లంపల్లిపై 56 పేజీల తప్పుడు పత్రాలను చూపారని అన్నారు. ఆ సమయంలో వైఎస్ఆర్ ఒరిజినల్ ప్రతులను చూపడంతో తోక ముడిచారని అన్నారు. రూల్స్‌ బుక్‌ను ప్రతి ఒక్కరు చదవాలని, ఇది చాలా ప్రాముఖ్యమని జగన్ అన్నారు. మనకు మెజార్టీ ఉంది కదా? అని చేయ్యి ఎత్తితే స్పీకర్‌ అనుమతించాలని అనుకుంటామని, సబ్జెక్ట్ పై ఎంత పరిజ్ఞానం ఉన్నా చేయ్యెత్తిన ప్రతిసారీ ఆయన స్పీకర్‌ అనుమతించకపోవచ్చారు. ఎంత గొప్ప వక్తయినా సరే మాట్లాడే సరికి కొంత భయం ఉంటుందని, మాట్లాడే అంశంపై ముందుగా సిద్ధం కావాలని సూచించారు. ప్రతిపక్షం ఇరుకునపెట్టడానికి ప్రయత్నిస్తుందని, ఇబ్బందికర పరిస్థితిని అధిగమించడానికి అంశంపై పూర్తిగా సన్నద్ధమవ్వాలని అన్నారు. ఇందుకు సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉంచుతామన్నారు. సంసిద్ధం కావాలనే తపన మీకు ఉండాలని, అది లేకుంటే అసెంబ్లీలో రాణించలేరన్నారు. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే సబ్జెక్ట్‌పై ప్రిపేర్‌ అయ్యేవాడినని గుర్తుచేశారు. ఈ సారి అసెంబ్లీలో గత మాదిరిగా పరిస్థితులు ఉండవని, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే మైక్‌లు కట్‌ చేసేవారని దుయ్యబట్టారు. కానీ, మన ప్రభుత్వంలో అలా ఉండదని జగన్ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించబోనని మరోసారి జగన్ స్పష్టం చేశారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఐదుగుర్ని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అన్నారు.. నేను మాత్రం వద్దాన్నాను.. అలా అయితే మనకు వాళ్లకు తేడా ఏంటి? అన్నారు. ఎవరైనా ఎమ్మెల్యేలను తీసుకోవాలంటే వారితో రాజీనామా చేయించి, మళ్లీ ప్రజల్లోకి వెళ్లి గెలిపించుకున్న తరువాత చేర్చుకుంటాం. చంద్రబాబుకు అవకాశం ఇచ్చామని, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో విందామన్నారు. ఆ తరువాత మన వాదన చెబితే ప్రజలు చూస్తారని, ఆ ధైర్యం, నమ్మకం మనకు ఉంటే ఎందుకు భయపడాలని జగన్ అన్నారు. వేరే పనులున్నాయని, సాకులు చెప్పి చట్టసభకు రాకపోవడం సరికాదన్నారు. వ్యూహం ఉండాలంటే అసెంబ్లీ మొదలుకావడానికి అరగంట ముందు రావాలన్నారు.


By July 03, 2019 at 12:49PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-ys-jagan-addressing-at-mlas-and-mlcs-awareness-campaign-in-amaravathi/articleshow/70053758.cms

No comments