Breaking News

హయత్‌నగర్ యువతి కిడ్నాప్ కేసు.. అద్దంకిలో వదలిపెట్టిన నిందితుడు


హయత్‌నగర్‌లో యువతి బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఆమెను ప్రకాశం జిల్లా అద్దంకిలో వదిలి పెట్టాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సోనీ తండ్రి యాదయ్యను వారం రోజుల కిందట నమ్మించి అతడి కుమార్తెను నిందితుడు రవి శేఖర్ కారులో ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. అద్దంకి బస్టాండులో సోనీని వదలిపెట్టిన నిందితుడు, అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో అక్కడున్న ఓ వ్యక్తి నుంచి ఫోన్ నుంచి తండ్రి యాదయ్య, మామయ్యలకు బాధితురాలు కాల్ చేసింది. సోనీని అపహరించిన నిందితుడు విజయవాడవైపు తీసుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో ఏపీ పోలీసులను అప్రమత్తం చేశారు. యువతి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు జల్లెడపట్టారు. కాగా, 8074397083 నంబర్ నుంచి ఆమె ఫోన్ చేసినట్టు పోలీసులకు తల్లిదండ్రులు చెప్పారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసిన తనను కడప జిల్లా ఒంటిమిట్ట, తిరుపతి తీసుకెళ్లి చివరకు అద్దంకిలో వదిలి పెట్టినట్టు యువతి వెల్లడించింది. దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు అక్కడ పోలీసులను అప్రమత్తం చేశారు. యువతి మంగళవారం ఉదయం అద్దంకి నుంచి హైదరాబాద్‌‌కు చేరుకుంది. కొద్దిసేపటి కిందటే ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌లో దిగిన ఆమె, పోలీసులను కలవనుంది. కాగా, నిందితుడు రవి శేఖర్ ఆచూకీ మాత్రం పోలీసులకు ఇంకా లభించలేదు. జులై 23న హయత్‌నగర్‌లో సోనీని రవి శేఖర్ కిడ్నాప్ చేశాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామని కూడా ప్రకటించారు. సోనీని కిడ్నాప్ చేసిన తర్వాత నిందితుడు రవి శేఖర్ భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. కరుడు గట్టిన నేరస్థుడైన రవి శేఖర్‌పై ఏపీలో పలు కేసులున్నట్టు తెలిసింది. యువతిని కిడ్నాప్ చేసిన తర్వాత నల్లగొండ జిల్లాలో ఘరానా మోసానికి పాల్పడినట్టు సమాచారం. ఈసారి వేషం మార్చి విజిలెన్స్ ఆఫీసర్‌గా వచ్చి వ్యాపారిని బురిడీ కొట్టించాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో.. విజిలెన్స్ అధికారి పేరుతో ఎరువుల దుకాణం యజమానిని బెదిరించి అతడి వద్ద రూ.లక్ష నగదు, 3 ఉంగరాలతో దోచుకున్నాడు. సీసీ ఫుటేజ్‌‌ను పరిశీలించిన పోలీసులు ‘విజిలెన్స్ ఆఫీసర్‌’ను రవి శేఖర్‌గా గుర్తించారు. సోనీని ఎక్కించుకొని వెళ్లిన కారులోనే అతడు కొండ్రపోలు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో తేలింది. గత మంగళవారం హైదరాబాద్‌లో యువతిని కిడ్నాప్ చేసిన రవి శేఖర్ తప్పించుకొని తిరుగుతున్నాడు. సోమవారం ఉదయం.. తెలంగాణ-ఏపీ సరిహద్దు సమీపంలోని నల్లగొండ జిల్లా కొండ్రపోల్ గ్రామంలోని ఎరువుల దుకాణంలో విజిలెన్స్ ఆఫీసర్ పేరుతో తనిఖీలు చేశాడు. ఉదయం 7.55 నిమిషాల నుంచి 8 గంటల 16 నిమిషాల వరకు ఫెర్టిలైజర్ దుకాణంలో విజిలెన్స్ ఆఫీసర్ పేరుతో తనిఖీలు చేపట్టాడు. వ్యాపారిని బెదిరించాడు. సొమ్ము, ఉంగరాలు తీసుకొని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. నిందితుడు విజయవాడ లేదా గుంటూరు వైపు వెళ్లి ఉంటాడని బావిస్తున్నారు పోలీసులు.


By July 30, 2019 at 08:09AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/hayathnagar-b-pharmacy-student-soni-safely-return-to-hyderabad/articleshow/70442787.cms

No comments