పీతల వల్లే డ్యామ్కు గండిపడిందన్న మంత్రి.. షాక్ ఇచ్చిన జనం!

గతవారం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న తివారీ ఆనకట్టకు గండిపడి 20 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనపై ఆ రాష్ట్ర నీటి వనరుల మంత్రి బాధ్యతరహిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డ్యామ్ గండిపడటానికి పీతలే కారణమని మంత్రి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో నిరసనకారులు మంగళవారం పీతలను వదిలారు. మంత్రి సావంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. మంత్రి ఇంటికి వెళ్లి తమ వెంట తెచ్చుకున్న పీతలను ఆయన గుమ్మం ముందు వదిలారు. బాస్కెట్లో తీసుకొచ్చిన వదిలిపెట్టడంతో ఇంట్లోకి, ఇంటి చుట్టుపక్కలకు పరుగులు తీశాయి. ‘ఇందులో మా తప్పు ఏముంది? మేము నేరస్థులం కాము’ అని పీతలు అంటున్నట్లుగా కార్యకర్తలు బ్యానర్లను ప్రదర్శించారు. ఈ ఆనకట్టకు గండిపడిన విషయంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల ఎన్సీపీ నేత జితేంద్ర అహ్వాద్ కూడా పీతలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి, వాటిని అరెస్ట్ చేయమంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ను రక్షించేందుకు పీతలపై నెపం వేయడం బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఆనకట్టకు గండిపడి 23 మంది గల్లంతయి 20 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికీ కొందరి ఆచూకీ లభించకపోతే పీతల వల్లే ఇలా జరిగిందని మంత్రి అనడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. మరోవైపు, కొల్హాపుర్లో ఎన్సీపీ యువజన విభాగం సైతం పోలీసులకు వినతిపత్రం అందజేసి, పీతలపై కేసు నమోదుచేయాలని కోరారు. ఆనకట్టకు గండిపడటానికి గల కారణాలపై మహారాష్ట్ర జల సంరక్షణ శాఖ మంత్రి తానాజీ సావంత్ ఇచ్చిన వివరణపై జనం విస్మయం వ్యక్తం చేశారు. డ్యామ్ చుట్టూ పెద్ద సంఖ్యలో పీతలు ఉన్నాయని, వాటివల్లే ఆనకట్టకు గండిపడిందని ఆయన చెప్పుకొచ్చారు. 2004 నుంచి ఈ ఆనకట్ట అందుబాటులోకి వచ్చినా గత 15 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి చెప్పారు. ఇంతకు ముందు లీకేజీలు లేవని, డ్యామ్ చుట్టూ పీతలు చేరిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారన్న ఆయన, అధికారులు కూడా దీనిపై చర్యలు ప్రారంభించినా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. శివసేనకు చెందిన ఎమ్మెల్యే తానాజీ సావంత్ మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రిగా ఉన్నారు. సావంత్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘2004 నుంచి తివారీ ఆనకట్ట వాడుకలో ఉంది.. గత 15 ఏళ్లుగా నీటిని నిల్వ చేస్తున్నా ఇలాంటి ఘటన జరగలేదు.. కొన్నిసార్లు నీరు లేక ఎండిపోయిందని, వర్షాల తర్వాత నిండి గండిపడింది.. దీనికి కారణం పెద్ద సంఖ్యలో పీతలు చేరడమేనని’ వ్యాఖ్యానించారు.
By July 10, 2019 at 11:22AM
No comments