Breaking News

రూ.కోట్లలో అప్పులు చేసి జల్సాలు.. తీర్చలేకే ఫైజల్ ఆత్మహత్య


రింగ్‌రోడ్డుపై గతవారం కారులో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఫైజల్ కేసులో లోతుకెళ్లే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపారంలో నష్టాల వల్లే చేసుకున్నాడని పోలీసులు ఇప్పటివరకు భావించారు. అయితే దర్యాప్తులో భాగంగా ఫైజల్ అసలు వ్యాపారాలే చేయడం లేదని తెలిసి షాకయ్యారు. వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో తనకు తెలిసినవారు, స్నేహితుల నుంచి రూ.లక్షల్లో అప్పులు తీసుకున్న ఫైజల్ వాటితో ఖరీదైన కార్లలో తిరుగుతూ జల్సాలు చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. తనకు అనేక వ్యాపార లావాదేవీలతో సంబంధాలున్నాయని, వాటిలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి స్నేహితుల దగ్గరనుంచి ఫైజల్ రూ.3లక్షలు అప్పుగా తీసుకునేవాడు. ఆరు నెలల తర్వాత వారికి వడ్డీగా రూ.లక్షన్నర ఇస్తుండటంతో దానికి ఆశపడిన వారు వడ్డీ మాత్రమే తీసుకుని అసలు అతడి దగ్గరే ఉంచేవారు. దాన్ని అవకాశంగా తీసుకున్న ఫైజల్ అందినచోటల్లా అప్పలు చేసి అవే డబ్బులతో వడ్డీలు కట్టేవాడు. మిగిలిన డబ్బులతో జల్సాలు, విహారయాత్రలు చేసేవాడు. ఇలా మొత్తం రూ.3కోట్ల వరకు ఫైజల్ అప్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో తనని కాల్చి తుపాకీ చేతిలో పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఫైజల్ భార్య చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఆ కోణంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో అతడిది ఆత్మహత్యేనని నిర్ధారణకు వచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన రోజు కూడా ఓ స్నేహితుడికి 12సార్లు ఫోన్ చేశాడని, ఆ తర్వాత 30నిమిషాలకు ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఫైజల్ వ్యాపారాలు చేస్తున్నాడనడానికి తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని, దాని పేరుతో దొరికిన చోటల్లా అప్పులు చేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొనితెచ్చుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.


By July 10, 2019 at 11:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-police-investigation-continues-in-faizal-suicide-case/articleshow/70154001.cms

No comments