జైపాల్రెడ్డి అంత్యక్రియల్లో స్వల్ప మార్పు.. ఒంటి గంటలోపే పూర్తి చేయాలని సూచన
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత సూదిని అంతక్రియలు సోమవారం నెక్లెస్ రోడ్డులో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. అయితే అంత్యక్రియల నిర్వహణలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటలోపే అంత్యక్రియలు పూర్తయ్యేట్లు చూడాలని ప్రభుత్వం జైపాల్రెడ్డి కుటుంబ సభ్యులకు సూచించింది. ప్రస్తుతం జూబ్లిహిల్స్లోని నివాసంలో ఉన్న జైపాల్రెడ్డి భౌతికకాయాన్ని అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం గాంధీభవన్కు తరలించనున్నారు. మరికొద్ది క్షణాల్లో అంతిమయాత్ర ప్రారంభంకానుంది. పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు, ఎల్వీప్రసాద్ ఆస్పత్రి, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి మీదుగా గాంధీభవన్కు తీసుకొస్తారు. తొలుత ఆయన పార్థీవదేహాన్ని గాంధీభవన్లో రెండు గంటలపాటు ఉంచాలని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ, ప్రభుత్వ తాజా సూచనతో ఆ సమయాన్ని గంటకు కుదించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ సమీపంలో జైపాల్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నారు. జైపాల్ రెడ్డిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్కు తరలి వస్తున్నారు. ఇక, ఏ సమస్యపైనైనా మాట్లాడ గలిగే వాగ్ధాటి.. సునిశిత విశ్లేషణ సామర్థ్యమే జైపాల్రెడ్డిని విద్యార్థి రాజకీయాల నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేలా చూసింది. చదువుకునే సమయంలోనే విద్యార్థి సంఘాల్లో కీలకపాత్ర పోషించిన జైపాల్రెడ్డి 1969లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి పరిమితమయ్యారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా తాను నమ్మిన సిద్ధాంతాల విషయంలో ఆయన రాజీపడలేదు. విలువలే ఆభరణంగా సాగిన ఆయన ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించి కాంగ్రెస్ను వీడారు. అనంతరం 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ బరిలోకి దిగగా ఆమెపై జనతాపార్టీ నుంచి పోటీ చేసి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యారు.
By July 29, 2019 at 12:05PM
No comments