Breaking News

తప్పని నిరాశ.. వాయుగుండంగా మారని అల్పపీడనం!


ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రంగా మారినా ఇంకా వాయుగుండంగా మారలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం వరకు ఇది తీవ్ర అల్పపీడనంగానే కొనసాగుతోందని తెలిపారు. ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్ని ఆనుకుని ఈశాన్య ఝార్ఖండ్‌ మీదుగా కేంద్రీకృతమై ఉన్నట్లు తెలియజేశారు. సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉందని వివరించారు. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయందాకా రణస్థలం, చీపురుపల్లిలో 7సెం.మీ, గరివిడిలో 6 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణపై ఉండదని అధికారులు తెలిపారు. రుతుపవనాల వల్లే వర్షాలు కురుస్తాయని అన్నారు. వీటి కదలికలు సాధారణంగా ఉన్నాయని, గురువారం నుంచి మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది నైరుతి దిశగా కదులుతుందని తొలుత అంచనా వేశారు. ఇది క్రమంగా బలపడి మంగళవారానికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కానీ, ఇది వాయుగుండంగా మారలేదన్న వాతావరణ శాఖ అధికారుల ప్రకటనతో ఒకింత నిరాశ తప్పలేదు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారుతుందని చెప్పడంతో రైతాంగం ఆశగా ఎదురుచూసింది. అయితే, వారి ఎదురుచూపులు మాత్రం ఫలించేలా లేవు. జూన్‌లో లోటు వర్షపాతంతో సాగుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విత్తనాల కొరత, లోటు వర్షపాతం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.


By July 03, 2019 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/low-pressure-area-continues-in-northeast-bay-of-bengal/articleshow/70050551.cms

No comments