Breaking News

తమ్ముడికి తోడుగా అన్న.. నాగబాబుకు జనసేనలో ఆ పదవి!


ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని స్పష్టం చేసిన అధినేత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఓటమి కారణాలను విశ్లేషిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి జనసేనాని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను, నాయకులను సమన్వయం చేసే బాధ్యతలను తన సోదరుడు నాగబాబుకు పవన్ అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు పవన్‌ కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కొందరు జనసేన పార్టీ నేతలతో మంగళవారం సమావేశమైన ఆయన వారి వద్ద ఈ విషయం ప్రస్తావించారు. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోనూ ఈ బాధ్యత నిర్వహించారని అంటున్నారు. తానా సభలకు వెళ్లిన తిరిగొచ్చిన తర్వాత విజయవాడలో పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీచేసి మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. పార్టీకి అభిమానులు ఉన్న అది ఓట్ల రూపంలో కురువలేదని గ్రహించిన జనసేన అధినేత, ఈ సమన్వయ బాధ్యతలను సోదరుడికి అప్పగించాలని భావిస్తున్నారు. ఇటీవలే పలు కమిటీల చైర్మన్లను కూడా ప్రకటించారు. లోక‌ల్‌బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌గా త‌మిళ‌నాడు మాజీ సీఎస్ రామ్మోహ‌న్‌రావు, మైనారిటీల కమిటీ చైర్మ‌న్‌గా విద్యావేత్త అర్హం ఖాన్‌, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ క‌మిటీ చైర్మ‌న్‌గా అప్పిక‌ట్ల‌ భ‌ర‌త్‌ భూష‌ణ్‌‌ను నియమించారు. మ‌హిళా సాధికారిత క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్‌‌గా కర్నూలు జిల్లాకు చెందిన రేఖాగౌడ్‌‌ను నియమించారు. ఇప్పటి వరకూ ఆమె జనసేన వీర మహిళా విభాగం చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పార్టీ నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్‌గా తోట చంద్ర‌శేఖ‌ర్‌, ప‌బ్లిక్ గ్రీవెన్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా రాపాక వ‌ర‌ప్ర‌సాద్, గ‌వ‌ర్న‌మెంట్ ప్రోగ్రామ్స్ మానిట‌రింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా చింత‌ల పార్థసార‌థిలను నియమించారు. త్వరలోనే రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఏడు కమిటీ చైర్మన్లలో ఇద్దరికి ఐఏఎస్‌లుగా పని చేసిన అనుభవం ఉండటం విశేషం.


By July 03, 2019 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/actor-nagababu-likely-to-appointed-as-janasena-party-coordinator/articleshow/70051012.cms

No comments