Breaking News

ముంబయి వర్షాలు: తెగిన ఆనకట్ట.. ఇద్దరు మృతి, 23 మంది గల్లంతు


గత ఐదు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబయి చిగురుటాకులా వణుకుతోంది. ఇప్పటి వరకు వర్షాలకు ఒక్క ముంబై పరిసర ప్రాంతాల్లో 37 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికిపైగా గాయపడ్డారు. తాజాగా రత్నగిరిలోని తివారి ఆనకట్టకు గండి పడింది. దీంతో ఆనకట్ట దిగువన ఉన్న 7 గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 23 మంది గల్లంతయ్యారు. దీని గురించి సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. రెండు మృతదేహాలను వెలికితీశారు. వరద ఉద్ధృతికి 12 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మంగళవారం కురిసిన అత్యధిక వర్షపాతం నమోదైంది. జులై నెలలో ఒక్కరోజే అత్యధిక వర్షపాతం నమోదవడం గత 45 ఏళ్లలో ఇది రెండోసారి. గడచిన 24 గంటల్లో ముంబైలో 375.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కేవలం ఆరు గంటల్లోనే అంటే రాత్రి 11.30 నుంచి తెల్లవారుజామున 5.30 వరకు 200 మి.మీ. వర్షపాతం నమోదుకావడం విశేషం. అయితే, 2005 జులై 26-27 తేదీలో కురిసిన 944.2 మి.మీ ఇప్పటి వరకూ అత్యధికం. మంగళవారం ఒక్కరోజే 30 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. మలాడ్‌లో గోడ కూలి 22 మంది చనిపోగా, 100 మందిపైగా గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయినవారిలో 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో 48 గంటల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలతో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడగా, పలు విమాన సేవలను సైతం రద్దు చేశారు. ముంబై విమానాశ్రయంలో రన్‌వే మరమ్మతులకు గురికావడంతో శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన ఐదు విమానాలను అర్ధాంతరంగా రద్దుచేశారు. అలాగే ముంబైలో దిగాల్సిన మూడు ఇంటర్నేషనల్, 10 డొమెస్టిక్ సర్వీసులను దారి మళ్లించి హైదరాబాద్‌కు తరలించారు.


By July 03, 2019 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/heavy-rains-in-mumbai-23-reported-missing-after-tiware-dam-breached-in-ratnagiri/articleshow/70050133.cms

No comments