కాణిపాకం: ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రేమ పెళ్లి.. జంటకు జరిమానా!

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది. అయితే, భద్రత కారణాల దృష్ట్యా స్వామివారి ఆలయంలో వివాహాలు చేసుకోవడం 20 ఏళ్ల కిందటే నిషేధించారు. కానీ, ఈ విషయం తెలియని తమిళనాడుకు చెందిన ఓ జంట పెళ్లి చేసుకుంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనపై అధికారులు స్పందించిన వారికి జరిమానా విధించారు. తెలియక చేసిన తప్పునకు అధికారుల ప్రవర్తనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తమిళనాడులోని కాట్పాడి జిల్లా కరుసమంగళానికి చెందిన ఓ జంట ఆలయ ధ్వజస్తంభం వద్ద పెళ్లి చేసుకుంది. అక్కడే ఉన్న అధికారులు, భద్రతా సిబ్బంది దీన్ని గుర్తించి, వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఆలయ అధికారులు వారి వద్ద నుంచి రూ.2,116 జరిమానా విధించి ఆలయ ఖాతాకు జమ చేయించారు. కాగా, ధ్వజస్తంభం వద్ద తాళికట్ట కూడదన్న విషయం తెలియని భక్తులకు అధికారులు జరిమానా వేశారని, దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. భద్రత నిర్వహిస్తున్న సిబ్బంది పర్యవేక్షణ నిత్యం ఉండాలని, హోంగార్డులు చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి భక్తలకు అపరాధం వేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఆలయ అధికారులు సైతం హోంగార్డులకు వత్తాసు పలకడం ఎంత వరకు సమంజసమని భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. కాగా, దీనికి ముందు రోజు బుధవారం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం వద్ద సుపథ మండపంపైకి మద్యం సేవించిన ఓ వ్యక్తి ఎక్కి దూకడానికి ప్రయత్నించాడు. స్వామి దర్శనార్థం వచ్చిన వ్యక్తి ఇలా చేయడంతో అక్కడే ఉన్న పలువురు భక్తులు దీన్ని గమనించి.. భద్రతా సిబ్బందికి తెలిపారు. దీంతో వారు అప్రమత్తమై మద్యం తాగి ఉన్న వ్యక్తిని క్షేమంగా కిందకు దించారు. అనంతరం ఆయన్ను స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
By July 12, 2019 at 11:42AM
No comments