Breaking News

గుంటూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ దాడులు.. ఐదుగురికి గాయాలు


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినా టీడీపీ, వర్గాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. వైసీపీ దాడుల్లో ఇప్పటికే ఐదుగురు కార్యకర్తలు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను వైద్యం కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వారిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. స్థానికుల కథనం ప్రకారం... తూబాడు ఎస్సీకాలనీలో ఉన్న టీడీపీ కార్యకర్త వాసిమల్ల పెద్ద అంకమ్మ ఇంటి ఎదుట రహదారికి అడ్డంగా వైసీపీకి చెందిన గుడిపూడి నీలాంబరం మొక్కలు నాటాడు. ఈ విషయమై నీలాంబరం, అంకమ్మ మధ్య శుక్రవారం మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. దీంతో శనివారం ఉదయం నీలాంబరం, అతడి కుటుంబ సభ్యులు కలిపి అంకమ్మ కుటుంబసభ్యులపై గొడ్డళ్లు, గడ్డపారలతో దాడిచేశారు. ఈ దాడిలో అంకమ్మ కుమారులు సాగర్‌, ఏసేబు, జీవన్‌బాబు, కోడలు జ్యోత్స్నకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అంకమ్మ మాట్లాడుతూ. .వైసీపీకి చెందిన గడిపూడి నీలాంబరం, ఆయన అనుచరులు 10 మంది మా ఇంటి ముందు గోయ్యి తవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఎందుకు చేస్తున్నారని నిలదీయగా.. మా ఇష్టం. ప్రభుత్వం మాది. నీకు దిక్కున్నచోట చెప్పుకోమన్నారని తెలిపారు. దీనిని అడ్డుకోవడంతో నీలాంబరం, ఆయన అనుచరులు నాపై గడ్డపార, గొడ్డలితో దాడిచేశారని అన్నారు. అడ్డుకున్న తన కుటుంబ సభ్యులపై కూడా దాడికి తెగబడ్డారని బాధితుడు వాపోయాడు. కుమారులు, కోడలు ఈ ఘటనలో గాయపడినట్టు అతడు వివరించాడు.


By July 13, 2019 at 12:11PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/clashes-between-ysrcp-and-tdp-followers-at-guntur-in-ap/articleshow/70202689.cms

No comments