‘దళంగా 60 మంది ఎమ్మెల్యేలం.. జగన్ కోసం తలలు తీయడానికైనా సిద్ధం’

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీపై సంచలన వ్యాఖ్యలతో ఎమ్మెల్యే రాచమల్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్ఠిగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కోసం తలలు తీసి యజ్ఞగుండంలో వేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. ఇందు కోసం మొత్తం 60 మంది ఎమ్మెల్యేలం దళంగా ఏర్పడ్డామని తెలిపారు. మరి మిగతా 90మంది ఎమ్మెల్యేల సంగతేంటని మీడియా ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జగన్పై ప్రేమ ఉన్న వారిలో హెచ్చుతగ్గులుంటాయని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు, టీడీపీ పెట్టిన ఇబ్బందులను తాము మరచిపోలేదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం విశేషం. కాగా, గతంలోనూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డికి సవాల్ విసిరిన రాచమల్లు.. వైసీపీ ఓడిపోతే ఎన్నికలలో పోటీచేయనని, టీడీపీ ఓడిపోతే మీరు పోటీ నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇసుక క్వారీ మంజూరు చేయాలంటూ 2017లో తీవ్రమైన పోరాటం చేశారు. గతేడాది తన నియోజకవర్గ పరిధిలోని 200 మంది రవాణా కార్మికులకు లైఫ్ ట్యాక్స్ కింద రూ.21 లక్షలు చెల్లించి పెద్ద మనసు చాటుకున్నారు. రవాణా కార్మికులకు రాబోయే రోజుల్లో కూడా ఎంతో కొంత ఆదుకోవడానికి సిద్దంగా ఉంటానని ప్రకటించారు.
By July 26, 2019 at 09:37AM
No comments