జులై 30 వరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు.. పరిమిత సంఖ్యలో విజటర్స్కు అనుమతి!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆర్థికశాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. మొత్తం 14 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. సెలవు దినాలతో కలిపి జులై 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గురువారం (జులై 11) ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 12న 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వ్యవసాయబడ్జెట్ను మంత్రి కురుసాల కన్న సభ ముందుంచనున్నారు. సభ నిర్వహణకు కొన్ని సంప్రదాయాలు, నిబంధనలు ఉన్నాయని, వాటిని అనుసరిస్తూ ఒక పద్ధతి ప్రకారం సభ నిర్వహిస్తామని స్పీకర్ తెలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో సభ్యుల సంఖ్య ఆధారంగా సభలో ఆయా పక్షాలకు సమయాన్ని కేటాయించనున్నట్టు వెల్లడించారు. అసంబద్ధ అంశాలపై సభాసమయాన్ని వృథా చేయడానికైతే అవకాశమివ్వలేమని స్పీకర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ప్రాంగణం అంత విశాలంగా లేనందువల్ల ఎక్కువ మంది సందర్శకులు వస్తే ఇబ్బందికరంగా ఉంటుందని వివరించారు. కాబట్టి ఎమ్మెల్యేలు తమ వెంట వచ్చే సందర్శకులను రోజుకు ఇద్దరికి పరిమితం చేసుకోవాలని స్పీకర్ సూచించారు. ప్రభుత్వ విప్లకు కార్యాలయాల ఏర్పాటు కూడా ఇబ్బందిగా ఉందని, పోలీసు కమాండ్ కంట్రోల్ రూం, క్యాంటీన్, లైబ్రరీలను ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
By July 10, 2019 at 12:42PM
No comments