Breaking News

ప్రకాశం: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గొడవ.. ఒకరు మృతి


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ, శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసింది. ఈ ఘర్షణలు అక్కడక్కడా ఇంకా కొనసాగుతోన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. జిల్లాలోని చినగంజాం మండలం రుద్రమాంబపురంలో తెల్లవారుజామున కార్యకర్తల ఇళ్లపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీనికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు సైతం దాడికి దిగారు. ఈ నేపథ్యంలో పద్మ (28) అనే టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ శ్రేణుల దాడులకు భయపడి పద్మను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బాధితులు సాహసించలేదు. దీంతో సకాలంలో వైద్యం అందక పద్మ మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఏర్పడిన వివాదమే ఘర్షణలకు కారణమని భావిస్తున్నారు. చినగంజాం పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాగా, వైసీపీ శ్రేణులు వైసీపీ నేతలు చేస్తున్న దాడుల గురించి టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించేందుకు గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామస్థులు గత మంగళవారం బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారని, దౌర్జన్యాలతో తమ పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ లోకేశ్ పది రోజుల కిందట చేసిన ఆరోపణలపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించిన విషయం తెలిసిందే. లోకేశ్ ఆరోపణలను ఖండించిన ఆమె, ఘాటుగా బదులిచ్చారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిపై చేయి చేసుకున్నదెవరు.. కాల్‌ మనీ వ్యవహారంపై మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్న చరిత్ర కలిగిన టీడీపీ నేతలు ఇప్పుడు తమ కార్యకర్తలపై దాడులు పెరిగాయనడం విడ్డూరంగా ఉందని సుచరిత విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 57 మంది వైసీపీ కార్యర్తలు గాయపడితే, 44 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. ఈ గణాంకాలు చూస్తే ఎవరిపై ఎవరు ఎక్కువగా దాడులు చేస్తున్నారో స్పష్టమవుతుందని హోం మంత్రి అన్నారు. మరోవైపు, ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు చేసిన దాడుల్లో ఐదురుగు టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆ పార్టీ అంటోంది.


By June 25, 2019 at 10:32AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/one-killed-and-several-injured-after-tdp-and-ysrcp-followers-clashes-injured-in-prakasam/articleshow/69937538.cms

No comments