తెలంగాణ ప్రజల దశాబ్దాల కల ‘కాళేశ్వరం’నేడు సాకారం
దాదాపు 17 లక్షల ఎకరాల భూములకు సాగు నీరందించి, తెలంగాణను సశ్యశ్యామలం చేసే సంకల్పంతో గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అత్యధిక జిల్లాలకు సాగు, తాగు నీరందించే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి శర వేగంగా పనులు పూర్తిచేసింది. మూడేళ్లలోనే భారీ బ్యారేజీలు, పంపుహౌస్లు, సొరంగాలు, కాల్వలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసుకున్న ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతికి అంకితం చేయనున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆధ్వరంలో జరిగే ఈ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఏపీ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్, జగన్మోహన్రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. గోదావరిపై నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి పరివాహక ప్రాంతాల పరిధిలోని కీలక రాష్ట్రాల సీఎలందరూ ఒకే వేదికపై ఆశీనులు కాబోతున్నారు. శుక్రవారం ఉదయం మేడిగడ్డ బ్యారేజీ వద్ద నిర్వహిస్తోన్న యాగంలో పాల్గొని, పూర్ణాహుతి స్వీకరిస్తారు. మేడిగడ్డ బ్యారేజి వద్ద కేసీఆర్తో గేట్లు ఎత్తించి నీటిని విడుదల చేయించేందుకు ఒకటి నుంచి ఆరో గేటు వరకు సిద్ధం చేశారు. ఇక్కడ జరిగే కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు పాల్గొంటారు. ఈ బ్యారేజి ప్రారంభించిన తర్వాత కన్నేపల్లి వద్ద మేడిగడ్డ పంపుహౌస్కు చేరుకుని అక్కడ నిర్వహిస్తోన్న యాగంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం పంపుహౌస్లోని మోటార్లను ప్రారంభించి, కాలువలోకి నీరు దూకే డెలివరీ సిస్టర్న్ వద్దకు వచ్చి పూజలు నిర్వహిస్తారు. మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంపుహౌస్ ప్రారంభోత్సవ సమయంలోనే సమాంతరంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్లు, ఎల్లంపల్లి దిగువన ఆరు, ఎనిమిది ప్యాకేజీలలో నిర్మించిన పంపుహౌస్లను మంత్రులు ప్రారంభిస్తారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు నీటిని మళ్లించే పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక్కడ కూడా మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, పూజలు నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించే ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 5,000 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి భారీగా కూంబింగ్ చేపట్టారు. కన్నెపల్లి పంప్హౌజ్, మేడిగడ్డ బ్యారేజీల వద్దకు పోలీసులు ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. కోల్కతా నుంచి తెప్పించిన పూలతో అందంగా ప్రాజెక్టును అలంకరించారు. కాళేశ్వరం ఆలయం, ప్రధాన కళ్యాణ మండపం, యాగశాలతోపాటు, పంప్హౌస్, డెలివరీ ఛానెల్, వేదిక, బ్యారేజీల వద్ద అలంకరణ చేశారు. శిలాఫలకాలను కూడా అందంగా ముస్తాబు చేశారు.
By June 21, 2019 at 08:41AM
No comments