Breaking News

పెద్దలు మందలించారని పారిపోయిన ప్రేమజంట... మూడు నెలల తర్వాత


తమ ప్రేమకు పెద్దలు అడ్డు తగులుతున్నారన్న ఆవేదనతో ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమలో ఒక్కటి కాలేకపోయినా మరణంలోనూ ఒక్కటవుదామని నిర్ణయించుకున్న చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మూడు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెలంగాణలోని జిల్లాలో విషాదం నింపింది. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రవి, రాధిక డిగ్రీ చదువుతున్నారు. చిన్ననాటి నుంచి పరిచయం కాస్తా ఇటీవల ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబ పెద్దలకు తెలియడంతో దూరంగా ఉండాలని హెచ్చరించారు. అయితే తమ ప్రేమకు పెద్దలు అడ్డు తగులుతున్నారని ఆవేదన చెందిన ప్రేమికులు మార్చి నెలలో ఇంటి నుంచి పారిపోయారు. దీంతో రవి, రాధిక తల్లిదండ్రులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినా వారి ఆచూకీ తెలియలేదు. వారిద్దరు ఎప్పటికైనా తిరిగి ఇంటికి వస్తారన్న ఆశతో రెండు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. అయితే కోయిలకొండ మండలంలోని కానాయపల్లికి చెందిన కొంతమంది గొర్రెల కాపరులు ఆదివారం రాంపూర్‌ గ్రామ సమీపంలోని గుట్టపైకి వెళ్లగా రెండు మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. దీంతో కంగారు పడిన వారు వెంటనే పోలీసులకు, గ్రామస్థులకు సమాచారమిచ్చారు. ఆ మృతదేహాలు ఇంటి నుంచి వెళ్లిపోయిన తమ బిడ్డలవేనని రవి, రాధిక కుటుంబసభ్యులు గుర్తించి రోదించారు. పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంసభ్యులకు అప్పగించారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన తమ బిడ్డలు ఎక్కడో చోట సుఖంగా బతుకుతుంటారని ఆశించామని, ఇలా ఆత్మహత్య చేసుకుని కడుపుకోతకు గురిచేస్తారని అనుకోలేదని ప్రేమజంట తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


By June 24, 2019 at 10:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/parents-reject-love-couple-commits-suicide-in-mahabubnagar-district/articleshow/69922265.cms

No comments