Breaking News

ఇంటికి 2 కిలోల చొప్పున.. నాలుగున్నర టన్నుల చేపలు ఫ్రీగా ఇచ్చాడు!


మునగాల మండల కేంద్రంలో సోమవారం ఏ ఇంట్లో చూసినా చేపల కూరే వండుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మునగాల చెరువులో పెంచిన చేపలను కాంట్రాక్టర్ నల్లపాటి శ్రీనివాస్ కొనుగోలు చేశారు. సోమవారం ఈ చేపలను పట్టారు. అయితే, వాటిని విక్రయించకుండా ముందుగా గ్రామస్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. మార్కెట్‌కు తీసుకెళ్లకుండా గ్రామంలోని రేషన్ కార్డు ఉన్నవారందరికీ పంచిపెట్టారు. మునగాలలో మొత్తం 2,500 రేషన్ కార్డుదారులు ఉండగా, వారికి ముందుగా కూపన్లు ఇచ్చారు. ఈ కూపన్ చూపించి చేపలు తీసుకున్నారు. ఒక్కో కూపన్‌కు రెండు కిలోల చేపలు ఉచితంగా ఇచ్చారు. ఇలా నాలుగున్నర టన్నుల చేపలను గ్రామస్థులకు ఉచితంగా ఇచ్చేశారు. పంచిపెట్టగా మిగిలిన చేపలనే విక్రయించాలనుకున్నట్టు కాంట్రాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పైసా తీసుకోకుండా రెండు కిలోలు చేపలు ఉచితంగా ఇవ్వడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన జనం చేపల కోసం ఎగబడ్డారు. కాగా, కొన్ని జిల్లాల్లోని చేపల చెరువులను జనం లూటీ చేసిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. జూన్ 6న మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రం, జూన్ 15న అదే మండలంలోని కాంపెల్లి చెరువు, ఆ మర్నాడు చిన్నగూడూరు మండలం నెరడ గ్రామంలోని చెరువులో చేపలను జనం దోచుకున్నారు. జూన్ 18న కురవి మండలానికి చెందిన చింతపల్లి గ్రామంలోనూ చేపలు లూటీ చేశారు. పన్నెండు రోజుల వ్యవధిలో రెండు మండలాలకు చెందిన నాలుగు గ్రామాల్లో చేపల చోరీకి గురయ్యాయి. చేపల చెరువుల్లో రాత్రివేళ దొంగతనాలు అడపా దడపా జరుగుతున్నాయి. కానీ పట్టపగలు అందరూ చూస్తుండగానే.. అదీ మత్స్యకారుల కళ్లముందే వందలాది మంది చెరువులు లూటీకి పాల్పడిన ఘటనలు జరగడం గమనార్హం.


By June 25, 2019 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/contractor-given-2-kilograms-fishes-per-family-without-money-in-munagala-in-nalgonda/articleshow/69938227.cms

No comments