Breaking News

Ukraine War రష్యా సైన్యం దాడి.. ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంలో మంటలు


ఉక్రెయిన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతూ పట్టి సాధించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ దాడులను సేనలు సైతం తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో రష్య దళాల దాడితో జపోరిజ్జియాలోని అణు విద్యుత్ ప్లాంట్‌లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. ఐరోపాలోనే అతిపెద్దదైన జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌లో శుక్రవారం తెల్లవారుజామున రష్యా దళాల దాడి తర్వాత మంటలు చెలరేగాయని సమీపంలోని ఎనర్‌గోదర్ పట్టణ మేయర్ దిమిత్రో ఓర్లోవ్ తెలిపారు. స్థానిక బలగాలు, రష్యా సైన్యం మధ్య భీకర పోరు కొనసాగుతోందని ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టిన ఓర్లోవ్.. వివరాలను వెల్లడించకుండానే ప్రాణనష్టం జరిగిందని తెలియజేశారు. జపోరిజ్జియాలోకి ట్యాంకులతో ప్రవేశించిన రష్యా సైన్యం.. ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తోందని అంతకు ముందు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ‘‘ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజ్జియా భవననాలు, యూనిట్లపై శత్రుమూకలు నిరంతరాయంగా షెల్ దాడులు జరపడంతో మంటల్లో చిక్కుకుంది’’ అని ఓర్లోవ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ పెట్టారు. ప్రపంచ భద్రత పెను ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. అగ్ని ప్రమాద తీవ్రతతో సహా సమాచారాన్ని రాయిటర్స్ వెంటనే ధ్రువీకరించలేకపోయింది. తొమ్మిదో రోజు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ ఐరోపా దేశంలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే కాగా.. వేలాది మంది చనిపోవడం, క్షతగాత్రులయ్యారు. మరోవైపు, పది లక్షల మంది ప్రాణభయంతో ఉక్రెయిన్ వీడారు. అటు, అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. పాశ్చాత్య దేశాలలో దశాబ్దాలుగా చూడని విస్తృత సంఘర్షణ భయాలు వెంటాడుతున్నాయి. దండయాత్ర మొదలుపెట్టిన రెండు రోజుల్లోనే ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ ప్లాంట్‌ను రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. రష్యా దుందుడుకు చర్యలను వ్యతిరేకిస్తూ అమెరికా, ఐరోపా దేశాలు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా, రష్యాకు చెందిన సంపన్నులపై అమెరికా, బ్రిటన్‌లు మరి కొన్ని ఆంక్షలను గురువారం ప్రకటించాయి. రష్యా వ్యాపార దిగ్గజం, మెటల్లోఇన్వెస్ట్ వ్యవస్థాపకుడు అలిషర్ ఉస్మానోవ్‌‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే, రష్యాకు చెందిన 19 మంది ఒల్గార్చ్‌లు, వారి కుటుంబసభ్యులు, సన్నిహితులపై అమెరికా వీసా ఆంక్షలు విధించింది. మరోవైపు, ఉక్రెయిన్‌కు మద్దతుగా గురువారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని... అమెరికా ప్రతినిధుల సభ నిష్ఠగా, నిశ్చలంగా, సగర్వంగా, ఉత్సాహంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ఉద్వేగపూరిత చర్చ జరిగింది. రష్యా దాడుల నుంచి తమ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌ ప్రజలు పోరాడుతున్నప్పుడు... యావత్‌ ప్రపంచం ఏవిధంగా స్పందిస్తోందన్నది చరిత్ర చూస్తోందని పలువురు సభ్యులు పేర్కొన్నారు.


By March 04, 2022 at 07:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/fire-at-ukraines-zaporizhzhia-nuclear-power-plant-after-russian-attack/articleshow/89981727.cms

No comments