Breaking News

ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. అక్కడ ఒకే రోజు డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 పెంపు!


ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శ్రీలంకలోని పెట్రోల్, డీజిల్‌ ధరలు ఒకే రోజు రికార్డుస్థాయిలో పెరిగాయి. లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్ఐఓసీ) ఇంధన ధరలను భారీగా పెంచేయడంతో ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. లీటర్‌ డీజిల్‌పై రూ.75 ( రూపాయి), పెట్రోల్‌పై రూ.50 చొప్పున పెంచినట్లు ఎల్‌ఐఓసీ శుక్రవారం వెల్లడించింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్ రూ.254కు చేరగా.. డీజిల్ రూ.214కు ఎగబాకింది. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఎల్ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తీవ్ర ఆర్థిక సంక్షోభం, వెరసి శ్రీలంకలో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఒకే నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి. ధరల పెంపుపై ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా మాట్లాడుతూ.. ‘శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమై డాలర్తో పోలిస్తే రూ.57కు తగ్గింది.. ఈ విధంగా రూపాయి విలువ క్షీణించడం ఏడు రోజుల్లో ఇది రెండోసారి.. ఇది చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల ధరలను నేరుగా ప్రభావితం చేసింది.. ఇంధన ధరల పెరుగుదలకు దారి తీసింది.. దాంతో పాటు రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సహా ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడం చమురు, గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి’ అని ఆయన వెల్లడించారు. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఎల్ఐఓసీ ఎలాంటి రాయితీలు పొందదని.. ఫలితంగా అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలతో సంస్థ నష్టపోతోందని మనోజ్ పేర్కొన్నారు. ఈ నష్టాల నుంచి బయటపడాలంటే.. ఇంధన ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేదని ఆయన తెలిపారు. ధరలు పెంచినప్పటికీ.. భారీ నష్టాలు తప్పడం లేదని ఆయన ఆందోళన వ్యక్త చేశారు. అయితే, శ్రీలంక చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. శ్రీలంక ప్రభుత్వం ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని అధిగమించే ప్రయత్నాలలో భాగంగా గత నెల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్కటి 40,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. శ్రీలంక IOC భారత సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ. ఇది శ్రీలంకలో 2002 నుంచి పనిచేస్తోంది. ద్రవ్యోల్భణం పెరుగుదలతో నిత్యాసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదనంగా రాష్ట్ర విద్యుత్ సంస్థ టర్బైన్‌లను నడపడానికి సరిపడా ఇంధనం లేకపోవడంతో పీక్ అవర్స్‌లో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. విద్యుత్ బోర్డు బకాయిల చెల్లించకపోవడంతో ఇంధన సంస్థ చమురు సరఫరాలను నిలిపివేసింది. క్రూడాయిల్ దిగుమతుల కోసం డాలర్లు చెల్లించలేక పోవడంతో ఉన్న ఒక్క రిఫైనరీ ఇటీవలే మూతపడింది.


By March 12, 2022 at 09:33AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/lanka-ioc-hikes-retail-prices-of-petrol-and-diesel-yet-again-due-to-ukraine-russian-war/articleshow/90163444.cms

No comments