Breaking News

భీకర పోరాటం జరుగుతున్న ఖార్కివ్‌, సుమీలో 1000 మంది భారత విద్యార్థులు!


రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలో కనీసం 1,000 మంది భారతీయులు చిక్కుకుపోయారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఖార్కివ్‌‌లో 300, సుమీలో 700 మంది భారత పౌరులు ఉన్నారని తెలిపింది. వారిని ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని స్పష్టం చేసింది. వీరి తరలింపు సవాల్‌గా మారిందని పేర్కొంది. ఈ అంశంపై ఉక్రెయిన్‌, రష్యా దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. ‘‘చివరి భారతీయుడ్ని సురక్షితంగా తరలించే వరకూ కొనసాగుతుంది.. సుమారు 2 నుంచి 3 వేల మంది ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు.. ఈ సంఖ్య మారవచ్చు... తూర్పు ఉక్రెయిన్‌లోని ప్రాంతాల్లో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించడంపైనే ప్రాథమికంగా దృష్టి సారించాం.. ఈ విషయంలో సహకరించాలని రష్యా, ఉక్రెయిన్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాం.. కాల్పులు విరమణ జరిగతేనే సాధ్యమవుతుంది’’ అని బాగ్చి తెలిపారు. సుమీ స్టేట్ యూనివర్శిటీలో చిక్కుకుపోయిన భారతీయ వైద్య విద్యార్థులు సహాయం కోసం అభ్యర్ధిస్తూ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. 800-900 మందికిపైగా హాస్టళ్లలో చిక్కుకుని ఆహారం, నీరు లేకుండా ఆకలితో అలమటిస్తున్నామని, బయట కాల్పులు, దాడులు, గడ్డకట్టే చలి వల్ల బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘‘ప్రభుత్వం సహాయం చేస్తుందని మేము ఎదురు చూస్తున్నాం.. కానీ మాకు ఎటువంటి సమాచారం లేదు, ఇక్కడ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా సరిహద్దులో బస్సులు ఉన్నాయని కొందరు అంటున్నారు.. మేము హాస్టల్ నుంచి బయటకు వస్తే ప్రతిచోటా స్నిప్పర్లు ఉన్నారు.. మేం వైమానిక దాడులకు భయపడుతున్నాం... ప్రతి 20 నిమిషాలకు బాంబు పేలుడు జరుగుతోంది’’ అని వారు ఒక వీడియోలో తెలిపారు. ‘‘మేము నరేంద్ర మోదీని అభ్యర్థిస్తున్నాం.. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లండి.. లేకుంటే మమ్మల్ని చంపేస్తారు.. ఇక్కడ నుంచి మాకు మేముగా బయటికి వస్తే ప్రాణాలు పోతాయి.. మేము భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం, దయచేసి మాకు సహాయం చేయండి.. ఆహారం, నీరు లేదు. టాయ్‌లెట్‌ వెళ్లాలన్నా నీరు లేదు. గత రాత్రి నుంచి చాలా మందికి తాగడానికి నీరు అందలేదు.. మేము చాలా ఆందోళన చెందుతున్నాం’’ అని వీడియోలో అభ్యర్థిస్తున్నారు. కాగా, ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 48 ప్రత్యేక విమానాల్లో 10,300 మందిని స్వదేశానికి తీసుకువచ్చినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ‘ఫిబ్రవరిలో అడ్వైజరీ జారీ చేసిన తర్వాత దాదాపు 20వేల మంది ఉక్రెయిన్‌ సరిహద్దులను దాటారు.. వారిలో ఇప్పటికే 10వేలకుపైగా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చాం.. 24 గంటల్లో మరో 16 విమానాలు భారత్‌కు రానున్నాయి.. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాం.. మా పౌరులను తీసుకెళ్లేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని విదేశాంగశాఖ వెల్లడించింది.


By March 05, 2022 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/1000-indians-still-in-ukraine-warzones-sumy-and-kharkiv-says-centre/articleshow/90006328.cms

No comments