Breaking News

ఆయన దర్శకత్వంలో నటించడం నా అదృష్టం : మెగాస్టార్ చిరంజీవి


సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ పుట్టిన‌రోజు నేడు (ఫిబ్ర‌వ‌రి 19). ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు తెలుగు అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన మెగాస్టార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. ‘‘గురు తుల్యులు, కళా తపస్వి కె.విశ్వనాథ్‌గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తం చేసి తెలుగు సినిమా చ‌రిత్ర శంక‌రాభ‌ర‌ణం ముందు, శంక‌రా భ‌ర‌ణం త‌ర్వాత అనేలా చేసిన మీరు తెలుగు వారంద‌రికీ అందిన వ‌రం. మీ చిత్రాలు అజ‌రామ‌రం. మీ దర్శ‌క‌త్వంలో న‌టించ‌డం నా అదృష్టం. మీరు క‌ల‌కాలం ఆయురారోగ్యాల‌తో సంతోషంగా ఉండాల‌ని ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాను’’ అన్నారు. చిరంజీవి హీరోగా క‌ళాత‌ప‌స్వి మూడు సినిమాల‌ను రూపొందించారు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో శుభ‌లేఖ అనే సినిమాను డైరెక్ట్ చేశారు విశ్వ‌నాథ్‌. త‌ర్వాత చిరంజీవి మాస్ హీరోగా అగ్ర స్థాయికి చేరుకున్న త‌ర్వాత కూడా విశ్వ‌నాథ్‌తో రెండు సినిమాలు చేశారు. అందులో ఒక‌టి స్వ‌యం కృషి. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్‌కు భిన్న‌మైన క‌థాంశంతో సాగే ఈ చిత్రంలో చిరంజీవిని చెప్పులు కుట్టే సాంబ‌య్య‌గా చూపించి అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఘ‌న‌త విశ్వ‌నాథ్‌కే ద‌క్కుతుంది. ఆ త‌ర్వాత ఆప‌ద్బాంధ‌వుడు సినిమాలో చిరంజీవి మాధవ అనే మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌లో చూపించారు విశ్వ‌నాథ్‌. ఎంత మాస్ ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ విశ్వ‌నాథ్ సినిమాల కోసం త‌న ఇమేజ్‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ చిరంజీవి సినిమాలు చేశారు. ఆడియోగ్రాఫ‌ర్‌గా సినీ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసిన కె.విశ్వ‌నాథ్ త‌ర్వాత అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మారారు. ఆత్మ గౌర‌వం సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు రాజ్య‌మేలుతున్న కాలంలో రొటీన్‌కు భిన్న‌మైన సినిమాలైన శంక‌రా భ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం, స్వాతి ముత్యం, స్వ‌యంకృషి వంటి విభిన్న‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించి ద‌ర్శ‌క‌కుడిగా విజ‌యాల‌ను సాధించి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ వ‌చ్చారు.


By February 19, 2022 at 10:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-birthday-wishes-to-kalatapasvi-k-viswanath/articleshow/89678920.cms

No comments