Breaking News

వేడెక్కిన హిజాబ్ వివాదం: తిలకం దిద్దుకుని వచ్చిన విద్యార్ధిని అడ్డుకున్న లెక్చరర్!


కర్ణాటకలో తీవ్రరూపం దాల్చింది. చదువే కాదు.. తమకు హిజాబ్‌ కూడా ముఖ్యమని ముస్లిం విద్యార్థినులు తెగేసి చెప్పడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. తుమకూరులోని జైన్‌ కళాశాలలో హిజాబ్‌కు అనుమతించలేదని ఇంగ్లిష్ లెక్చరర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మూడేళ్లుగా తాను హిజాబ్‌ ధరించే పాఠాలు చెబుతుంటే.. ఇప్పుడు ధరించరాదని ప్రిన్సిపల్‌ హెచ్చరించడంతో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, హిజాబ్ వివాదం శుక్రవారం మరో మలుపు తిరిగింది. విజయపుర జిల్లాలోని కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇండి పట్టణంలోని ప్రభుత్వ కళాశాలకు నుదుటిపై తిలకాన్ని దిద్దుకుని వచ్చిన విద్యార్థిని అధ్యాపకుడు అడ్డుకున్నారు. తరగతి గదిలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో ఇతర విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. తిలకం దిద్దుకుని వస్తే ఎందుకు అనుమతించరంటూ వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. హిజాబ్ వివాదంపై తుది నిర్ణయం వెలువరించే వరకూ మతపరమైన వస్త్రాలను అనుమతించరాదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. కేవలం వస్త్రాలకు మాత్రమే ఆంక్షలు విధించి, తిలకం, గాజులు వంటి ఇతర అంశాల గురించి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో తిలకం దిద్దుకుని వచ్చిన విద్యార్ధికి అనుమతి నిరాకరించడంతో దుమారం రేగింది. కాగా, బెళగావిలో హిజాబ్‌‌తో వచ్చిన విద్యార్థినులను ప్రత్యేక తరగతి గదిలో ఉంచాలని నిర్ణయించారు. తొలుత ఆరుగురు విద్యార్థినులను కళాశాల ప్రవేశద్వారానికి వెలుపలే నిలిపి ఉంచారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన జిల్లా పాలనాధికారి హీరేమఠ్‌ జోక్యం చేసుకుని విద్యార్థినులను వెలుపల ఉంచడం సరికాదన్నారు. వారిని ప్రత్యేక గదిలో కూర్చునే ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో చర్చిస్తానని చెప్పారు. న్యాయస్థానం మధ్యంతర ఆదేశాల్ని అమలు పరచాల్సి ఉన్నందున సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా నందగడలో హిజాబ్, కాషాయ శాలువాల వివాదం తారస్థాయికి చేరుకుంది. శుక్రవారం కొందరు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి హాజరుకాగా, మరికొందరు విద్యార్థులు కేసరి శాలువాలతో వచ్చారు. రెండు వర్గాల విద్యార్థులకు సర్దిచెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలనూ ఇళ్లకు పంపారు. ఇలాంటి పరిస్థితే మరికొన్ని కళాశాలల్లో కూడా తలెత్తడంతో ఫిబ్రవరి 23 వరకు సెలవుల్ని ప్రకటించారు.


By February 19, 2022 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/hijab-row-student-told-to-remove-tilak-from-forehead-to-enter-karnataka-college/articleshow/89677200.cms

No comments